ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ ఆర్థిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలను రాజకీయంగా వజ్రాయుధంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై పార్టీ అధ్యక్షుడు విపక్షనేతలతో మాట్లాడుతూ వారందరినీ ఏకతాటి పైకి తీసుకువచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కమ్యూనిస్టులు సహా దాదాపు 20 పార్టీలు ఈ విషయంలో కలిసి పోరాడేందుకు నిర్ణయించాయి. అయితే ఈ ప్రయత్నాలకు కొన్ని విపక్షాల నుంచి ఆశించిన రీతిలో మద్దతును కాంగ్రెస్ పార్టీ పొందలేకపోతోందనే చెప్పాలి. ఈ వ్యవహారంపై జేపీసీ అవసరం లేదని, సుప్రీం కోర్టు నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తే సరిపోతుందని ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాజాగా మహారాష్ట్రలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న రాజకీయ కూటమిలో కాంగ్రెస్, శివసేనలతో పాటు భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్పవార్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది.
కాగా జేపీసీ డిమాండును శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ మాత్రం మరోసారి గట్టిగా సమర్థించారు. ఈ దర్యాప్తు కచ్చితంగా అవసరమని, జేపీసీ వేస్తేనే అన్ని అంశాలూ బయటకు వస్తాయని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ, అదే సమయంలో జేపీసీ కూడా ఏకకాలంలో ఎంక్వయిరీ జరిపితే మరీ మంచిదని ఆయన అన్నారు. . పారిశ్రామివేత్తలకు మద్దతు ఇవ్వాలిగానీ అవినీతికి కాదన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి, ఎన్సీపీకి మధ్య తలెత్తిన విభేదాల విషయమై తానేమీ వ్యాఖ్యానించలేనని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యతపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే శరద్పవార్ తన సొంత అభిప్రాయాన్ని తెలిపారని, దానివలన విపక్షాల ఐక్యతకు ఎలాంటి ఇబ్బందీ లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ప్రకటించారు. కాగా మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి అదానీ వ్యవహారం అందివచ్చిన అవకాశంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏమేరకు విజయం సాధించగలదో చూడాల్సిఉంది.