ఈ మధ్య కాలంలో దర్శకుల ప్రతిభ కారణంగా సౌత్ సినిమాల సంచలన విజయాలతో అందరూ ఇటువైపు చూస్తున్నారు గానీ అంతకుముందు ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఖాన్ త్రయం సృష్టించిన రికార్డులు సాధారణమైనవి కాదు. బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్, మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ లకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. దేశవ్యాప్తంగానే కాదు.. ఇతర దేశాల్లోనూ వీరికి అభిమాన గణం ఉంది. ఆ మాట కొస్తే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం రికార్డు మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కిన దంగల్ పేరిటే నమోదై ఉంది. కోవిడ్ కారణంగా వీరినుంచి రావాల్సిన భారీ సినిమాలు కాస్త లేటయినా ఇప్పుడు అవన్నీ వరుసగా పట్టాలెక్కుతున్నాయి.
ఈ ముగ్గురు సీనియర్ హీరోల్లోనూ గతంలో ఘన విజయాలున్నా ఇటీవలికాలంలో షారుక్ఖాన్ నుంచి సరైన హిట్ మూవీ రాలేదని చెప్పాలి. ఇప్పుడు ఆయన అభిమానుల ఆశల్ని పూర్తిస్థాయిలో తీర్చే మూవీగా తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో తనదైన ముద్ర ఉన్న సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ తమ బ్యానర్లో 50వ చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించిందీ చిత్ర బృందం. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే, మరో స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. అటు షారుక్కు సరైన హిట్ ఇవ్వడంతోపాటు బాలీవుడ్కు పునర్వైభవం తెచ్చిపెట్టే భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అటు హిందీతో పాటు ఇటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది.