‘ మొక్కల్ని పురుగులు తినడం ప్రకృతి నియమం. అయితే కొన్ని మొక్కలు పురుగుల్ని తింటున్నాయనే విషయం మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది..’
క్రిములు, కీటకాలు, చిన్న జంతువులను ట్రాప్చేసి తినేసే అరుదైన మాంసాహార మొక్కను ఉత్తరాఖండ్ అటవీ శాఖ బృందం తొలిసారిగా కనుగొన్నది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ‘యుట్రిక్యులేరియా ఫర్సెల్లాటా’ అనే అత్యంత అరుదైన మాంసాహార వృక్ష జాతులను కనుగొన్నట్లు సీనియర్ అధికారి ఒక ప్రకటనలో వెల్లడించారు. చమోలి జిల్లాలో ఉన్న సుందరమైన మండల్ లోయలో ఈ అరుదైన జాతులను కనుగొన్నట్లు చెప్పారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పరిశోధన) సంజీవ్ చతుర్వేది ప్రకారం, ఇది ఉత్తరాఖండ్లోనే కాకుండా మొత్తం పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మొదటిసారిగా రేంజ్ ఆఫీసర్ హరీష్ నేగి, జూనియర్ రీసెర్చ్ ఫెలో మనోజ్సింగ్తో కూడిన ఉత్తరాఖండ్ అటవీ శాఖ బృందం ఈ అరుదైన మొక్కలను కనుగొన్నది. ఈ వివరాలు ప్రతిష్టాత్మక ‘జర్నల్ ఆఫ్ జపనీస్ బోటనీ’లో ప్రచురితమయ్యాయి. ఇది మొక్కల వర్గీకరణ, వృక్షశాస్త్రంపై 106 ఏళ్ల నాటి జర్నల్గా పరిగణిస్తారు. ఈ మొక్కను తొలిసారిగా గుర్తించడం తమకు గర్వకారణంగా ఉందని సంజీవ్ చతుర్వేది తెలిపారు.
మాంసాహార మొక్కలంటే?
క్రిములు, కీటకాలను, చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంసభక్షణ లేదా మాంసాహార మొక్కలు అని అంటారు. ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ మొక్కలు నత్రజని లోపించిన బురద నేల్లోనే పెరుగుతాయి. ఇవి తమకు కావాల్సిన నత్రజనిని సొంతంగా తయారుచేసుకోలేవు. అందువల్ల క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను ‘బోను పత్రాలు’ అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వల్ల కీటకాల్లోని ప్రోటీన్లు విశ్లేషించి జీర్ణం చేస్తాయి. జీర్ణమైన ప్రోటీన్లను ఈ పత్రాలు శోషిస్తాయి.