‘ రోడ్ల దుస్థితి. గోతులు కూడా పూడ్చని సర్కారు.. – అంత మాత్రాన జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబికవు. ఎందుకంటే 95 శాతం ప్రజల్లో సామాజిక స్పృహలేదు. ‘
‘మద్యం, ఇసుక, గనులలో జగన్ దోపిడీ..- -మద్యం ధరలు పెరిగితే కాస్త తిట్టుకుంటారంతే. ఇసుక కూడా అంతే. ఇక మైన్స్ దోచుకుని.. లెట్రైట్ మాటున బాక్సయిట్ ను చైనా తరలించుకుపోయినా సామాన్యులకు అక్కర్లేదు. పేదలకు సంక్షేమం పేరుతో ఇచ్చే చిల్లర అందితే చాలు. ఎంత దోచుకున్నా వాళ్లకి అనవసరం. పిల్లల భవిష్యత్తు కంటే ఇపుడు జగనన్న ఇచ్చే సొమ్మే ముఖ్యం.’
‘ అమరావతిని సర్వనాశనం చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నా భూములు ఇచ్చిన రైతాంగానికి తప్ప మిగిలిన రాష్ట్ర ప్రజలకు పెద్ద పట్టింపు ఉండదు.’
జనంలో సామాజిక చైతన్యం మాట అటుంచి., కనీస స్పృహ లేనపుడు జగన్ లాంటి కక్ష్యపూరిత పాలకులకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. సంక్షేమం పేరిట తాయిలాలు జల్లుతున్నంత కాలం పెద్దగా ప్రజా వ్యతిరేఖత రాదు. టీడీపీ అనుకూల మీడియా మాత్రం చంద్రబాబు కళ్ళకు గంతలు కడుతూ., జగన్ ని జనం అసహ్యించుకుంటున్నారు.. అంటూ తప్పుదారి పట్టిస్తున్నారు. జగన్ చేస్తున్నవి ముమ్మాటికీ రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లే చర్యలే. ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు రాతలు, ABN కూతలు మితిమీరడం వల్ల జనంలో పెద్దగా విశ్వాసం నింపలేకపోతున్నాయ్. ఇది ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన్ కి అనుకూలమే అవుతుంది. జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత ఉంది. జగన్ ని అసహ్యించుకునే పరిస్థితికి ఇంకా రాలేదు.
అనుకూల మీడియా పోకడలతో ‘టీడీపీ’కి నష్టం
పిడుక్కీ, బియ్యానికి ఒకే మంత్రం వేస్తున్న ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థల వల్ల ‘టీడీపీ’కి లాభం కంటే నష్టమే ఎక్కువ. 2019 ఎన్నికల్లో టీడీపీని బీజేపీకి దూరం చేయడంలో ABN-ఆంధ్రజ్యోతి శక్తివంచన లేకుండా పనిచేసాయి. బీజేపీకి దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేఖత ఉందని ఆర్కే కూడా తన కొత్తపలుకు కాలమ్ లో వీలున్నప్పుడల్లా ప్రవచించేవారు. ‘జగమెరిగిన జర్నలిస్ట్ ఆర్కే చెపితే ఇక ఆలోచించేదేముంది..మనం గుడ్డిగా ఫాలో అయిపోదాం..అన్న పిచ్చి భ్రమల్లో చంద్రబాబు అండ్ కో పడిపోయి.. అధికారానికి దూరమవ్వడమే కాదు. టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలించుకున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంతలా గొంతు చించుకుని చెప్పకపోతే చంద్రబాబు బీజేపీని వదిలిపెట్టేవారు కాదని టీడీపీలో ఓ సీనియర్ నేత గతంలోనే వాపోయారు.
గతాన్ని తవ్వుకోవడం వల్ల ఇపుడేం చేయగలం. నిజమే. ఇపుడు కూడా చాలా వరకు ఆంధ్రజ్యోతిపైనే ఆధారపడుతున్న టీడీపీ ఆత్మావలోకనం చేసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఆంధ్రజ్యోతి రాస్తున్నవి మెజార్టీ నిజాలే. కానీ గతంలో చేసిన అత్యుత్సాహానికి పాఠకులలో విశ్వాసం బాగా తగ్గింది. కోర్ టీడీపీ తప్ప తటస్తులు జ్యోతిలో వస్తున్న వాటిని పూర్తిగా నమ్మడంలేదు.
జగన్ సీఎం హోదాలో దావోస్ వెళ్లినా.. ఆ టూర్ లో మధ్యలో లండన్ లో చదువుకుంటున్న కుమార్తెలను కలుసుకున్నా బూతద్దంలో చూపడం .. ఏదో జరిగిపోతుందన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నించడం.. ఇవన్నీ జనం గమనిస్తారన్న ఆలోచనే ఉండదు. వైసీపీ కూలి మీడియా, నీలి మీడియా తరహాలోనే ఆంధ్రజ్యోతి కూడా కొన్నింటిపై అతి చేయడం వైసీపీని డ్యామేజ్ చేయాలనీ చేసే ప్రయత్నాలు బెడసికొట్టి రివర్స్ లో తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతొంది.
2014-2019 టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రకటనల రూపంలో ఆంధ్రజ్యోతికి అదనంగా కోట్ల రూపాయలు అందాయి. ఆ కృతజ్ఞత, ఇదే సమయంలో పూర్తిగా యాడ్స్ ఆపేసిన అక్కసుతో జగన్ పై ఉన్న కక్ష్య.. టీడీపీ ని ఏదోలా అధికార పీఠం ఎక్కించాలని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఆపసోపాలు పడుతున్నారు. ఈనాడు, ఈటీవీ వంటివి ఆంధ్రజ్యోతి మాదిరిగా వన్ సైడ్ రాయవు. తిమ్మిని, బమ్మి చేసే ప్రయత్నం చేయరు. తటస్తులు నమ్మినా, నమ్మకపోయినా చంద్రబాబు అండ్ కో కు కూడా ఆంధ్రజ్యోతిపై ఆధారపడటం తప్పని పరిస్థితిగా భావిస్తున్నారు.
అదే తప్పు..
చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చెప్పుకోదగ్గ రీతిలో పార్టీలో యువ రిక్రూట్ మెంట్ జరగలేదు. అదే ఇపుడు పార్టీలో వృద్ధ జంబూకాల ఆటలకు చెక్ చెప్పలేకపోవడానికి ఆటంకంగా ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడుపైనే ముందు నుంచీ పూర్తిగా ఆధారపడుతూ వస్తున్న చంద్రబాబు… మరో పత్రిక, రెండు, మూడు ఛానల్స్ ను (కనీసం టివీ5 స్థాయిలో) ప్రత్యామ్న్యాలుగా పెట్టుకుంటే ఇపుడు ఆదుకునేవి. ఈ విషయంలో చంద్రబాబు, టీడీపీ మేధావి బృందాలు పునరాలోచన చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు పత్రికలూ, ఛానల్స్ ని సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా బలమైన ప్రభావం చూపుతున్న ఈ రోజులలో టీడీపీ కూడా ఈ దిశగా మరింత కసరత్తు చేసి.. ఆచరణలోకి దిగితే ఆ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మంచిది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, గనులు, ఇసుక వంటి సహజ వనరుల దోపిడిని అరికట్టాలంటే.. కనీసం ఆ దిశగా ప్రయత్నించాలంటే సోషల్ మీడియా ద్వారానే యువతను మేలుకొల్పాలి. ఎందుకంటే యూత్ లో 80-90 శాతం మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. బలమైన సోషల్ మీడియా వ్యవస్థ ఏర్పాటుపై ద్రుష్టి సారించాలి.