దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రూ. వెయ్యికోట్ల క్లబ్లో చేరిన మూడు భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన టాలీవుడ్ స్టార్ హీరోలు తారక్, చెర్రీ ఈ చిత్రం తరువాత పాన్ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సినీ అభిమానులను అలరించిన ఈ చిత్రం ఆన్లైన్ వేదిక పైన సైతం విశేషంగా ఆదరణ పొందింది. తాజాగా ఈ చిత్రాన్ని జపాన్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 21న జపాన్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని విడుదల చేయనున్నట్టు ట్విటర్ వేదికగా చిత్రబృందం ప్రకటించింది.
ఇప్పటికే హాలీవుడ్ డైరెక్టర్ల నుంచి ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం జపాన్ ప్రేక్షకులను మెప్పించి అక్కడ కూడా మంచి విజయం సాధించడం ఖాయమని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. భారతీయ స్టార్ హీరోల్లో రజనీకాంత్కు జపాన్లోనూ విశేష సంఖ్యలో అభిమానులున్నారు. బాహుబలిని అద్భుతంగా మలిచిన రాజమౌళి ప్రతిభకు ఆ దేశ ప్రజలు ఫిదా అయిపోయారు. ప్రభాస్ కూడా జపనీయులకు అభిమాన హీరోగా మారిపోయాడు. అంతేకాదు తారక్ చిత్రాలకు కూడా అక్కడ మంచి ఆదరణే ఉంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, తారక్, చెర్రీల అద్భుత నటన అక్కడి సినీ అభిమానులను మరోసారి కట్టిపడేయడం, కాసుల వర్షం కురిపించడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చన్నమాట.