పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పార్థ చటర్జీ అనుచరురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఏకంగా రూ.20 కోట్ల నగదును గుర్తించి సీజ్ చేశారు. వెస్ట్బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్లో అక్రమాలకు సంబంధించిన ‘ఎస్ఎస్సీ స్కాం’ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలకు వెళ్లిన అధికారులకు ఈ సొమ్ము దొరికింది. మొత్తం రూ. 500, రూ. 2,000 నోట్ల కట్టల రూపంలో ఈ డబ్బు ఉన్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. ఎస్ఎస్సీ స్కాంలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో చట్టవిరుద్దంగా నియామకాలు చేపట్టినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పుడు అర్పిత ముఖర్జీ ఇంట్లో కనుగొన్న సొమ్ము ఎస్ఎస్సీ స్కాం అక్రమాలకు సంబంధించినదేనని భావిస్తున్నట్టు అధికారులు చెపుతున్నారు.
టీఎంసీ ప్రభుత్వంలో గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమల శాఖలను నిర్వహిస్తున్న పార్థ చటర్జీకి అర్పిత ముఖర్జీ అనుచరురాలు కావడం గమనార్హం. కాగా ఈ స్కాంతో సంబంధమున్న మంత్రి పార్థ ఛటర్జీ కోసం అన్వేషిస్తున్నట్టు ఈడీ అధికారులు చెపుతున్నారు. ఈ స్కాంతో సంబంధించిన రికార్డులు, పత్రాలు, కంపెనీల నకిలీ వివరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ నగదు, బంగారాన్ని వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరించారు. కేంద్రంపై రాజకీయంగా మడమ తిప్పని పోరాటం సాగిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఈ కేసు తలనొప్పిగా పరిణమించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.