దక్షిణాది పరిశ్రమల నుంచి ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హీరోలలో దక్షిణాదివారిదే పైచేయి అని చెప్పాలి. అయితే ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితమే బాలీవుడ్ పరిశ్రమపై దృష్టి సారించి అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఘనత సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్హాసన్లకే దక్కుతుందని చెప్పాలి.
ఆ తరువాత బాలీవుడ్ పరిశ్రమతో సంబంధం లేకుండానే కోలీవుడ్ సినిమాల మార్కెట్ పరిధి పెరగడంతో వారు దక్షిణాదికే పరిమితమయ్యారు. రజనీకాంత్ తిరుగులేని మాస్ ఇమేజ్తో సూపర్ స్టార్డమ్ సంపాదిస్తే, కమల్ తనకు మాత్రమే సాధ్యమైన విభిన్నపాత్రలతో తనలోని నటుడిని సంతృప్తిపరచుకునే సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలన్నది చాలాకాలంగా సగటు సినీ అభిమాని కోరిక.
కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో కలిసి నటించిన ఈ సీనియర్ స్టార్లు ఆ తరువాత కలిసి చేసిన సినిమాలు చాలా తక్కువే. మల్టీస్టారర్ మూవీలో కలిసి నటించేందుకు వీరికి ఎలాంటి అభ్యంతరం లేకున్నా అభిమానులను మెప్పించడం కష్టమన్న కారణంతో డైరెక్టర్లు అందుకు సాహసం చేయలేదని చెప్పుకోవాలి. నిజానికి గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి అఖండ విజయాన్ని అందుకున్న దళపతి చిత్రంలో కమల్హాసన్ నటించాల్సి ఉంది. అయితే సినిమాలోని సన్నివేశాల్లో హీరోల మధ్య క్లాష్ వస్తే థియేటర్లలో అభిమానుల మధ్య కూడా గొడవలవుతాయని భయపడి ఆ పాత్రలోకి మమ్ముట్టిని తీసుకున్నట్టు అప్పట్లో దర్శకుడే స్వయంగా చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. అయితే ఈ క్రేజీ కాంబోను సెట్ చేసి తమ అభిమానుల కోరిక తీర్చేందుకు ఇప్పుడు స్వయంగా కమల్హాసన్ పూనుకోవడం విశేషం.
తన సొంత బ్యానర్పై రజనీకాంత్ హీరోగా లోక్ష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించేందుకు కమల్హాసన్ రెండు మూడేళ్ల క్రితం సన్నాహాలు చేశారు. అయితే కోవిడ్ పాండమిక్ కారణంగా ఆ చిత్రం ప్రారంభం కాలేదు. తాజాగా కమల్ హీరోగా వచ్చిన విక్రమ్ మూవీ ఘనవిజయం సాధించి కోలీవుడ్లో రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రజనీతో తాను అనుకున్న ప్రాజెక్టుపై కమల్ మళ్లీ దృష్టి సారించాడట. అయితే ఈసారి తానూ రజనీ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రంగా దీనిని మలిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి విక్రమ్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
భారీ బడ్జెట్తో రూపొందబోయే ఈ చిత్రంలో కమల్, రజనీ ఇద్దరూ భాగస్వాములుగా ఉండబోతున్నట్టు కోలీవుడ్ కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇటు కమల్, రజనీతో పాటు అటు దర్శకుడు కనగరాజ్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది చివరిలో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ మూవీని హాలీవుడ్ స్థాయిలో రూపొందించి అలరించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇద్దరు సూపర్స్టార్లతో తెరకెక్కించే మూవీతో మరెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి మరి.