భారత సంతతికి చెందిన రిషి సునాక్.. ఇంగ్లండ్ ప్రధాని పదవిని అలంకరించే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు గాను జరుగుతున్న పోరులో మంగళవారం జరిగిన నాలుగో రౌండులోనూ మిగిలినవారికంటే రిషి సునాక్ ఆధిక్యం దక్కించుకున్నారు. ఆయనకు 118 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న పెన్నీ మోర్డాంట్ 92 ఓట్లు, మూడో స్థానంలో ఉన్న లిజ్ట్రూజ్ 86 ఓట్లు దక్కించుకున్నారు. నాలుగో స్థానంలో ఉన్న కెమి బడెనోచ్కు 59 ఓట్లు మాత్రమే రావడంతో ఆమె పోటీనుంచి వైదొలగాల్సి వచ్చింది. గురువారం జరిగే చివరి రౌండ్ తర్వాత బరిలో ఇద్దరే మిగులుతారు. తుది రౌండ్లో నిలవాలంటే 120 ఓట్లు రావాల్సి ఉంటుంది.
అయితే ఇక్కడితో ఎన్నిక ప్రక్రియ పూర్తయినట్టు కాదు. ఇప్పటిదాకా కన్జర్వేటవ్ పార్టీ ఎంపీలు మాత్రమే ఎన్నికలో పాల్గొనగా, తుది అభ్యర్థిని 1,60,000 మంది అర్హులైన ఆ పార్టీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఆ ఎన్నికలో గెలిచిన వ్యక్తి ని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. ఇలా గెలిచిన వ్యక్తే బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ రిషిసునాక్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో చివరి దశలో ఏమవుతోందనే ఉత్కంఠ కలుగుతోంది. రెండు వందల ఏళ్లపాటు భారత్ను వలసదేశంగా మార్చుకుని పాలించిన ఇంగ్లండ్ కు భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి ప్రధాని కావాలని మన దేశంలో అత్యధికులు కోరుకుంటున్నారు.