దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తన నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు తారక్, రాంచరణ్ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన ఘనతను మూడు చిత్రాలు మాత్రమే దక్కించుకోగా వాటిలో రెండు మన జక్కన్నవే కావడం విశేషం. సహజంగానే రాజమౌళి తరువాత ప్రాజెక్టు ఎలా ఉండబోతుందనే అంశం సినీ అభిమానులకు అత్యంత ఆసక్తిని కలిగించేదే. అయితే ఈ విషయంపై రాజమౌళి ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్తో పాన్ వరల్డ్ స్థాయిలో ఓ పవర్ఫుల్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే జక్కన్న లీకులిచ్చాడు.
ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విజయాన్ని ఆస్వాదిస్తుండగా, మహేష్ ‘సర్కారువారి పాట’ కు సంబంధించి తన పనులన్నీ పూర్తి చేసుకుని ఫ్యామిలీతో సహా ఆదివారం ఫారిన్ టూర్కి బయలుదేరాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారువారి పాట’ వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. కాగా అదే సమయంలో ఇటు రాజమౌళి కూడా విదేశాలకు పయనమయ్యాడు. విశేషమేమిటంటే వీరిద్దరూ వెళ్లింది దుబాయ్కే కావడం. దీంతో వీరిద్దరూ కలిసి చేయబోతున్న ప్రాజెక్టుపై చర్చల కోసమే అక్కడికి వెళ్లినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మహేష్ ప్రతి ఏటా కొన్ని రోజులు కుటుంబంతో కలిసి విదేశాల్లో గడిపిరావడం ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే సహజంగా సమ్మర్లో ఏ యూరోపియన్ దేశాలకో యూఎస్కో కాకుండా దుబాయ్ వెళ్లడం, అదే సమయంలో జక్కన్న కూడా అక్కడికే వెళ్లడంతో ఇది సినిమాకు సంబంధించిన చర్చల కోసమేనన్న టాక్ వినిపిస్తోంది.
మొదటిసారిగా వీరిద్దరి కాంబోలో భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే మొదలుకానున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. కాగా రాజమౌళి చిత్రం అంటేనే నాణ్యతలో రాజీపడడు కాబట్టి కాస్త ఎక్కువ సమయం పట్టడం ఖాయమని, ఈలోగా మహేష్ వేరే దర్శకుడితో మరో చిత్రంలో నటించే అవకాశం ఉందన్న వార్తలూ వస్తున్నాయి. వీరిద్దరూ తేల్చి చెపితేనే కానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.