ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవల కోసం ప్రస్తుతం దేశంలోని పలు రాజకీయపార్టీలు వెంపర్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా ఇప్పటిదాకా బీజేపీకి పని చేసిన పీకే ఇకనుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయనున్నాడని, ఏకంగా ఆ పార్టీలో చేరి పార్టీ పూర్వ వైభవం కోసం కృషి చేయనున్నట్టు మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతో కలిసి ఏకకాలంలో పని చేసేందుకు ఆయన సిద్ధమవుతుండటం, ఆయా పార్టీలను వీలైతే పొత్తు పెట్టుకునేలా ప్రయత్నాలు సాగించడం మాత్రం తలలు పండిన రాజకీయ పండితులకు కూడా విస్మయం కలిగిస్తున్న అంశమేనని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా అంతర్గతంగా చేపట్టాల్సిన చర్యలు, ఎన్నికలకు ఏవిధంగా సిద్ధం కావాలనే అంశాలపై ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అందించినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే అదే సమయంలో పీకే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం, ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు సాగించడం, వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఓ పట్టాన కొరుకుడు పడే అంశం కాదు. ఇక తాను కాంగ్రెస్ పార్టీలో చేరినా తన ఆధ్వర్యంలోని ఐప్యాక్ టీం టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని కూడా సెలవిచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసేలా, ఏపీలో వైసీపీతో కలిసి పోటీ చేసేలా అతడు మంతనాలు సాగిస్తున్నాడన్న వార్తలు విస్తు గొలుపుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.
రేవంత్ రెడ్డి పీసీసీ చైర్మన్ అయ్యాక టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటం కారణంగా ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. బీజేపీ అక్కడ గతంలో కన్నా బలం పుంజుకున్న విషయం వాస్తవమే ఐనా, రాష్ట్రంలో అధికారం సాధించగల స్థాయికి రావడానికి చాలా దూరంలోనే ఉంది. మరి పీకే సలహా ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు సాధ్యమేనా..? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ నాయకులు బీజేపీ బాట పడితే ఆ పార్టీకి అది సువర్ణావకాశంగా పరిణమించదా..? ఇక ఏపీలో ఏమాత్రం బలం లేని కాంగ్రెస్తో వైసీపీ పొత్తు పెట్టుకోవడం వలన ఆ పార్టీకి వచ్చే లాభం ఏమిటి..? అనవసరంగా బీజేపీతో సున్నం పెట్టుకోవడానికి ఆ పార్టీ ఎందుకు అంగీకరిస్తుంది..? ఇలాంటి ప్రశ్నలెన్నో ఇప్పుడు పీకే వ్యవహారం చూశాక రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఇకపై పీకే, అతడి ఐప్యాక్ బృందం ఏయే పార్టీలతో కలిసి పనిచేయనున్నారో, ఎవరిని ముంచనున్నారో, ఎవరిని ఒడ్డున పడేయనున్నారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందని చెప్పాలి.