బాలీవుడ్ పై సౌత్ సినిమాలు వరుసగా దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలకు అక్కడి ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తుండటంతో ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను చిన్నచూపు చూసిన బాలీవుడ్ హీరోలు, నిర్మాతలతో పాటు అక్కడి సినీ పండితులకు కూడా గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఇదే అంశంపై తమ అక్కసు వెళ్లగక్కి అభాసుపాలయ్యారు కూడా. ఇక తాజాగా ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ సినిమాల వసూళ్ల స్థాయి చూశాక సౌత్ సినిమా వస్తోందంటే తమ సినిమాను అక్కడి ప్రముఖ హీరోలు కూడా వాయిదా వేసుకుంటున్నారంటే అతిశయోక్తి లేదు. మరోపక్క సౌత్ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ నటులు వరుస కడుతున్నారు. ఇక హీరోయిన్ల విషయం సరేసరి. గతంలో సౌత్ వైపు చూడటానికి ఇష్టపడని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు ఈ సినిమాల్లో అవకాశాల కోసం తహతహలాడుతున్నారు.
‘కేజీఎఫ్-2’ లో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్దత్ నెగిటివ్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం బాలీవుడ్ లో రికార్డు స్థాయి విజయం సాధించడానికి అది కూడా ఓ కారణమే. దీంతో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప ది రూల్’ మూవీలో కూడా ఇదే తరహాలో ఓ సీనియర్ బాలీవుడ్ నటుడు ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. సునీల్షెట్టి. ఇతడు గతంలో సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ చిత్రంలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తెలుగులోనూ ఇటీవల వరుణ్తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ చిత్రంలోనూ, దానికంటే ముందు మంచు విష్ణు మూవీ ‘మోసగాళ్లు’ లోనూ సునీల్ షెట్టి నటించినా ఆ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే మొదటి పార్ట్ ఘనవిజయం సాధించడంతో పుష్ప రెండో పార్ట్ కు విపరీతమైన బజ్ క్రియేట్ అయిన నేపథ్యంలో సునీల్షెట్టి పాత్రను సుకుమార్ ఎలా రూపొందించనున్నాడో చూడాల్సి ఉంది. కేజీఎఫ్కు దీటైన చిత్రంగా నిలిపేందుకు సుక్కూ మరిన్ని ఆకర్షణలు జోడించే అవకాశమూ లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం టాక్ నడుస్తోంది.