నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడం, కోవిడ్ పాండమిక్ పరిస్థితుల నాటినుంచి థియేటర్లకు వచ్చి చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో చిత్ర పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది విజయాలు సాధించిన చిత్రాలను వేళ్లమీద లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన రెండు చిత్రాలు మంచి టాక్ను దక్కించుకోవడంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆ చిత్రాలు నందమూరి కళ్యాణ్రామ్ కథానాయకుడిగా ప్రేక్షకులముందుకు వచ్చిన ‘బింబిసార’. మరొకటి వైజయంతీ మూవీస్ బ్యానర్లో దుల్కర్సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘సీతారామం’.
విభిన్నమైన కథాంశంతో సోషియో ఫాంటసీ చిత్రంగా కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసార’ మంచి ఓపెనింగ్స్ దక్కించుకోవడంతోపాటు ప్రేక్షకులను మెప్పించింది. హీరో కల్యాణ్రామ్కు మంచి కమ్బ్యాక్ మూవీగా నిలిచిందన్న ప్రశంసలు దక్కించుకుంది. క్యాథెరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఇందులో కథానాయికలుగా నటించారు. కల్యాణ్రామ్ 2,500 సంవత్సరాలనాటి క్రూరుడైన చక్రవర్తి బింబిసారుడిగా, అతడి సోదరుడు దేవదత్తుడిగా, టైమ్ ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి వచ్చిన మోడ్రన్ బింబిసారగా అద్భుతంగా ప్రదర్శించిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అతడి కెరీర్లోనే బెస్ట్ పెరఫార్మెన్స్ అందించిన చిత్రంగా ఇది నిలుస్తుంది. నిర్మాతగానూ కల్యాణ్రామ్కు ఇది మంచి విజయం. ఈ చిత్రం విజయంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అందించిన సంగీతం, ఛోటా కే నాయుడి సినిమాటోగ్రఫీ కూడా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పాలి.
ఇక ప్రఖ్యాత వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్త సమర్పణలో హనూ రాఘవపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సీతారామం కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. యుద్ధం, ప్రేమ వంటి రెండు విభిన్నమైన నేపథ్యాలను సమన్వయం చేస్తూ మనసును హత్తుకునే ఫీల్గుడ్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడి ప్రతిభకే పెద్ద పీట వేయాలి. మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, రష్మికా మందణ్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సుమంత్, శత్రు కూడా ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. ఈ చిత్రాలు మంచి విజయం సాధించి చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని అందించాయని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.