ప్రపంచంలోనే అత్యంత ఆదరణను సొంతం చేసుకున్న ఐఫోన్ లు తయారుచేసే యాపిల్ కంపెనీ వాస్తవానికి అమెరికాకు చెందినది. అయితే ప్రస్తుతం తన ఉత్పత్తుల్లో ఎక్కువశాతం చైనాలో తయారు చేస్తోంది. ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకుని లాభదాయకత పెంచుకునేందుకు అనుసరించే వ్యాపారం వ్యూహంలో భాగంగా డ్రాగన్ దేశంలో యాపిల్ సంస్థ గతంలో తయారీ కేంద్రాలు నెలకొల్పింది. అయితే గడచిన కొన్నేళ్లుగా అమెరికా- చైనాల మధ్య పలు అంశాలతోపాటు.. వాణిజ్యపరంగాను వైరం పెరుగుతుండటం యాపిల్ కంపెనీకి ఇబ్బందికరంగా మారింది. ఇక కోవిడ్ కారణంగా చైనాలోని కొన్ని నగరాల్లో నెలల తరబడి కఠిన లాక్డౌన్ కొనసాగడం యాపిల్ తయారీ కేంద్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలోనే చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆ కంపెనీ భావిస్తున్నట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా యాపిల్ సంస్థ భారత్ను ఎంచుకున్నట్టు ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి.
యాపిల్ నుంచి కొత్త మోడల్ ఫోన్ వెలువడుతుందంటే ప్రపంచవ్యాప్తంగా దానిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఇకపై ఇలాంటి ఫోన్లు మనదేశంలోనే తయారుకానున్నట్టు ఆ కంపెనీ నుంచి వస్తున్న వార్తలు వెల్లడిస్తున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి లాంచ్ చేసేందుకు యాపిల్ సంస్థ సిద్ధమవుతోంది. ఈ సిరీస్లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లను సంస్థ తీసుకొస్తోంది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, డిజైన్లపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. కాగా తాజాగా ఐఫోన్ 14కు సంబంధించి ఇండస్ట్రీ అనలిస్ట్ మింగ్ చి కువో షేర్ చేసిన కొన్ని వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఐఫోన్ 14 మోడళ్లలో కొన్ని చైనాతోపాటు ఇండియాలోనూ తయారవుతున్నాయని కువో అందులో పేర్కొన్నారు. భారత్లో ప్రస్తుతం ఐఫోన్లను ఉత్పత్తి చేస్తున్న ఫాక్స్కాన్ సైట్ చైనా తయారీదారులతో ఏకకాలంలో ఐఫోన్ 14 మోడళ్లను రవాణా చేసే పనిని తీసుకుంటుందని కువో తన ట్వీట్స్లో వెల్లడించారు. దీంతో చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాక వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ మార్కెట్ కూడా ఆ సంస్థకు లక్ష్యంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.