శ్రీలంక దివాలా అంచున ప్రయాణిస్తుండగా, మరో సరిహద్దు దేశమైన పాకిస్థాన్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్తాన్ దేశం దివాలా తీసి.. అస్థిరత ఏర్పడితే మన దేశం మరింత ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉందని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.
మత ఛాందసవాదం ప్రబలడం, అక్కడి అణ్వస్త్రాలు తాలిబన్ మూకల చేతిల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రతి నెలా పాక్ విదేశీ రిజర్వులు అడుగంటుతున్నాయి. ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగి లీటరు పాల ధర 260 పాకిస్థానీ రూపాయలుగా ఉంది. ఇక విద్యుత్తు సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. వీటికి తోడుగా చైనా అప్పు ఉండనే ఉంది. దీనికి అదనంగా గత నెలాఖరున చైనా మరో 2.3 బిలియన్ డాలర్ల రుణం విదిల్చింది. దీని వడ్డీ రేటు మాత్రం పీఎంఎల్-ఎన్ సర్కారు గోప్యంగా ఉంచింది. ఇవి దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపించలేవు. ఇలాంటివి గతంలో శ్రీలంకలో సంక్షోభానికి ముందు కనిపించిన పరిణామాలే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి అక్కడి ప్రభుత్వం గాడిదల పెంపకం, ప్రజలు టీ తక్కువ తాగడం వంటి విచిత్రమైన మార్గాలపై కూడా దృష్టిపెట్టింది.
పతనమవుతున్న కరెన్సీ పాకిస్థాన్ కరెన్సీ విలువ గణనీయంగా పడిపోతోంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.30కిపైగా విలువ కోల్పోయిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తాజాగా అది ఒక డాలర్కు రూ.207 వద్దకు చేరింది. అదే సమయంలో కరెంటు ఖాతా లోటు పెరిగింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వద్ద 2019 తర్వాత అతి తక్కువ విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయి. గత నెల చైనా నుంచి 2.3 బిలియన్ డాలర్లు అప్పు వచ్చినా మొత్తం రిజర్వు 10 బిలియన్ డాలర్ల లోపే ఉంది.
ఐఎంఎఫ్ నిబంధనలు పాటించలేక..: ఐంఎంఎఫ్ కఠిన షరతులను అమలు చేయాల్సి ఉండటంతో పాకిస్థాన్ అప్పుల కోసం చైనా, సౌదీ, యూఏఈ వంటి దేశాలను కూడా ఆశ్రయిస్తోంది. 2018లో పాకిస్థాన్ ఒక సారి బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్ను ఆశ్రయించింది. దీంతో బడ్జెట్ లోటు తగ్గించాలని, బ్యాంకింగ్, పన్ను వ్యవస్థను మెరుగుపర్చాలని, పేదలకు సామాజిక భద్రత పెంచాలని, విదేశీమారక ద్రవ్య విలువ నియంత్రణలో పాక్ కేంద్ర బ్యాంక్ జోక్యం తగ్గించుకోవాలని పేర్కొంది. పాక్ వీటిల్లో అతి తక్కువ షరతులను మాత్రమే పూర్తి చేసింది. 2013, 2016ల్లో విదేశీ అప్పులు తీసుకొంది.
భారీగా దిగుమతులు..: మరో వైపు దేశీయ అవసరాల కోసం దిగుమతులు మాత్రం తగ్గడంలేదు. 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్ 30 నాటికి పాక్ 80 బిలియన్ డాలర్ల విలువైన సరకులు దిగుమతి చేసుకొంది. ఫలితంగా కరెంటు ఖాతా లోటు పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 13.2 బిలియన్ డాలర్ల కరెంటు ఖాతా లోటు, విదేశీ అప్పులు చెల్లింపుల నిమిత్తం మరో 12 బిలియన్ డాలర్ల వరకూ అవసరం ఉంటుంది.
ఆర్థిక సంక్షోభం తప్పించుకొలేదా? .?: పాకిస్థాన్ ఇష్టమున్నా లేకపోయినా.. ఐఎంఎఫ్ చెప్పిన ప్రోగ్రామ్ను అమలు చేయాల్సిందే. ఆర్థిక సంస్కరణలు చేపట్టి మార్కెట్ నమ్మకాన్ని చూరగొనాలి. దిగుమతులు, వ్యయాల్లో భారీ కోత విధించాల్సిందే. అనవసరమైన ప్రాజెక్టులకు కేటాయింపులను ఆపేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. గతంలో ఇంధనం, విద్యుత్తుపై భారీ రాయితీలు ఇస్తే తాము సాయం చేయమని ఐఎంఎఫ్ తేల్చి చెప్పింది. దీంతో పాక్ ధరలను పెంచింది.
గతంలో శ్రీలంక వద్ద విదేశీ మారక ద్రవ్యం హరించుకు పోగానే దివాలా ప్రకటించింది. ఆ తర్వాత ఇంధనం, ఆహారం ఇతర నిత్యావసరాలకు కొరత తీవ్రమైంది. పాక్ కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.