తెలుగు హీరోలలో దగ్గుబాటి రానా రూటే సెపరేటు. సరైన కథతో ఆయన వద్దకు వెళ్లాలే కానీ విలన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు వరకు ఏ పాత్ర చేయటానికైనా సిద్ధమనేస్తారు. మిగిలిన హీరోల మాదిరి తన సినిమాల్లో పాటలు.. ఫైటింగులు.. గ్లామర్ సీన్లు.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్ల గురించి ఆలోచించరు. సినిమాల పరంగా మిగిలిన వారికి భిన్నంగా ఉంటారో.. టాలీవుడ్ లో శక్తివంతమైన సినిమా ఫ్యామిలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రానా.. వ్యక్తిగత విషయాల్లోనూ అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం కనిపిస్తుంటుంది. అలాంటి రానా తాజాగా ఫిలింనగర్ భూవివాదం కేసులో సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఇంతకీ ఏ వివాదానికి సంబంధించి ఆయన కోర్టు కి వెళ్లాల్సిన పని ఎందుకు వచ్చింది..
తెలుగమ్మాయి.. గతంలో వరుస పెట్టి సినిమాల్లో హీరోయిన్ గా మెరిసిన మాధవి లత గుర్తుంది కదా? ఆమెకు ఫిలింనగర్ లో 2200 చదరపు గజాల స్థలం ఉంది. దాన్ని దగ్గుబాటి సోదరులు సురేశ్.. వెంకటేశ్ లు గతంలో కొనుగోలు చేశారు. వీరిద్దరూ ఆ స్థలాన్ని వేరే వ్యాపారికి లీజుకు ఇచ్చారు. అయితే.. ఈ డీల్ ను 2016లోనూ.. 2018లోనూ రెన్యువల్ చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. లీజు అగ్రిమెంట్ కొనసాగుతున్న వేళలో ఆ మొత్తం స్థలంలోని వెయ్యి గజాల్ని దగ్గుబాటి రానాకు రిజిస్ట్రేషన్ చేశారు.
లీజు గడువు పూర్తి కాకుండానే వ్యాపారిని తన స్థలం నుంచి ఖాళీ చేయాలని రానా ఒత్తిడి చేశారన్నది ఆరోపణ. దీనికి సంబంధించిన పిటిషన్ ను కోర్టులో దాఖలు చేయటం.. దీనికి సంబంధించిన కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం రానా కోర్టుకు రావాల్సి వచ్చింది. దీనిపై కోర్టులో మరింత విచారణ జరగాల్సి ఉంది. దీంతో.. ఈ కేసును వాయిదా వేశారు. సినీ గ్లామర్ ఉన్న రానా సిటీ సివిల్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో.. కోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది. పలువురు ఆయన్ను చూసేందుకు.. ఆయనకు సంబంధించిన కేసు వివరాల్ని తెలుసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.