ఒకప్పుడు కళకళలాడే నదులు.. ప్రస్తుతం చుక్క నీరు లేక బోసిపోతున్నాయి. ఎక్కడ చూసినా.. జలచరాల కళేబరాలతో, ఎండిన ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. పచ్చదనంతో కళకళలాడే నదీ పరీవాహక ప్రాంతాలు.. ఎడారులు తలపిస్తున్నాయి. అడుగంటిన నీటి నిల్వలతో నీటి ప్రాజెక్టులు కళతప్పాయి. సాగునీరు లేక వ్యవసాయం చేయలేక రైతన్నలు దిక్కులు చూస్తున్నారు. పశువులకు మేతలేక పాల కోసం అల్లాడుతున్నారు. చివరకు తాగునీటిపై కూడా ఆంక్షలు మొదలవడంతో.. జనం గొంతెండిపోతోంది. ఇదీ.. ప్రస్తుతం యూరప్ దేశాల పరిస్థితి. అక్కడ సగానికి పైగా దేశాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. పశ్చిమ, దక్షిణ, మధ్య యూరప్ లోని చాలా దేశాల్లో చినుకు నేలను తాకి 65 రోజులు దాటింది.
గత 400 ఏళ్లలో యూరప్ లో సంభవించిన అతి భీకరమైన కరువు ఇదేనని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా శీతకాలంలో కురిసే మంచు ప్రభావంతో వేసవి నాటికి ఇక్కడి నదులు తాజా నీటితో కళకళలాడుతుంటాయని, కానీ, ఈ సారి వాతావరణ మార్పులతో.. శీతాకాలంలో మంచు కురవడం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో.. నదులన్నీ పూర్తిగా ఎండిపోయాయని అంటున్నారు. తూర్పు ఆఫ్రికా, పశ్చిమ అమెరికాతో పాటు ఉత్తర మెక్సికోలోనూ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయి.
బ్రిటన్లో ఆంక్షలు
వడగాడ్పుల ప్రభావంతో.. దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దీంతో.. అక్కడ నీటి వినియోగంపై ఆంక్షలు మొదలయ్యాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే నీటితో పాటు తాగునీటికి కూడా కష్టాలు మొదలయ్యాయి. అన్నింటికీ ప్రభుత్వం పరిమితులు, ఆంక్షలు విధించింది. నైరుతి, తూర్పు, మధ్య ఇంగ్లాండ్ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్న ప్రభుత్వం.. ఆయా ప్రాంతాల్లో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది.