‘కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో చాలా ప్రాంతాలలో విడదీయరాని బంధం ఏర్పరచుకున్న జాన్సన్ బేబీ పౌడర్ ఇక కనుమరుగు కానుంది. ‘
ప్రపంచ ప్రముఖ హెల్త్కేర్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా టాల్కం బేబీ పౌడర్ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడాలోనైతే ఈ ఉత్పత్తుల అమ్మకాలను 2020లోనే నిలిపివేసింది. అయినప్పటికీ, కోర్టుల్లో దావాలు పెరుగుతూపోతుండటంతో ఇక ఏ దేశంలోనూ విక్రయించకూడదని కంపెనీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఇకపై అన్ని బేబీ పౌడర్ ఉత్పత్తుల్లోనూ టాల్కం పౌడర్కు బదులు కార్న్స్టార్చ్ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది. కంపెనీ బేబీ టాల్కం పౌడర్లోని ఆస్బెస్టాస్ కారణంగానే తమకు కేన్సర్ సోకిందంటూ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోర్టుల్లో ఇప్పటివరకు 38,000కు పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. కంపెనీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ వచ్చింది. కంపెనీ టాల్కం బేబీ పౌడర్ సురక్షితమైనదని, ఆస్బెస్టాస్ రహిత ఉత్పత్తులని దశాబ్దాలపాటు శాస్త్రీయ పరీక్షలు, నియంత్రణ మండళ్ల అనుమతులే తెలిపాయని జే అండ్ జే తన గత వ్యాఖ్యలను పునరుద్ఘాటించింది.