- సైన్యం దాడుల్లో ఇప్పటి వరకు 3 వేల మంది మృతి
- ప్రతిపక్ష కార్యక్రమంపై తాజాగా వైమానిక దాడి
అక్కడ సైన్యం హింసాకాండ రోజురోజుకు మితిమీరిపోతోంది. మయన్మార్ లో సైనిక పాలన సాగుతున్న విషయం తెలిసిందే.. దానిని వ్యతిరేకించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. నిన్న నిర్వహించిన అలాంటి ఒక కార్యక్రమంపై సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 100 మంది వరకు మరణించినట్టు సమాచారం. వారిలో చాలా మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి ఫిబ్రవరి 2021లో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిని సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. బలగాల దాడిలో ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది చనిపోయారు. మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం నిన్న స్థానిక కార్యాలయ ఏర్పాటుకు ప్రారంభోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 150 మంది హాజయ్యారు. విషయం తెలిసిన సైన్యం ఆ కార్యక్రమంపై వైమానిక దాడికి చేసింది. ఈ ఘటనలో 100 మంది మరణించినట్టు ప్రజాస్వామ్య అనుకూల గ్రూప్, స్వతంత్ర మీడియా తెలిపాయి.