ఎలుక హత్యా.. అని ఆశ్చర్యపోవాల్సిందే మరి? ఉత్తరప్రదేశ్ లో జరిగిని ఈ ఘటన గురించి వింటే అసలు మనం ఎక్కడున్నామని మనల్ని మనమే ఒకసారి గిల్లుకోకతప్పదు. తోటి మనుషుల్ని రకరకాల వివక్షలతో చూస్తాం. మతం, కులం, రంగు, పొట్ట పొట్టి కారణాలతో ఎన్నో దుర్మార్గాలు జరిగుతున్నాయి. కాని మరో పక్క ఎలుకలు, కుక్కలకు అన్యాయం జరిగితే కేసులు పెట్టే పరిస్థితి కూడా ఉంది. ఎలుకను హత్య చేశాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. గతేడాది నవంబరులో కుమార్ ఎలుక తోకకు రాయి కట్టి దానిని కాలువలో పడేశాడు. అది చూసిన వికేంద్రశర్మ దానిని కాలువ నుంచి బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేశాడు. కాని అది అప్పటికే మరణించింది.
దీంతో వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమార్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కుమార్ బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి నిర్వహించిన ఫోరెన్సిక్ నివేదికలో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా ఊపిరాడక చనిపోయిందని తేలింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్పై 30 పేజీల చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు, చేపలు, గొర్రెల మాంసాన్ని అమ్మే వ్యాపారులపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.