‘వందల ఏళ్ల క్రితం ప్రపంచంలో భారత దేశమే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేది. బ్రిటిష్ ఆక్రమణతో భారత్ వెనక్కి వెళ్ళింది. మనల్ని పాలించిన బ్రిటన్ కంటే ఇపుడు భారత్ ఆర్ధిక వ్యవస్థ ముందుకు దూసుకువచ్చింది…’
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. బ్రిటన్ ఆరోస్థానానికి పడిపోవడంతో.. ఆ స్థానానికి భారత్ చేరుకుందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. మార్చి త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ 854.7 మిలియన్ డాలర్లుగా ఉండగా.. యూకే ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 మిలియన్ డాలర్లుగా ఉంది. తొలి త్రైమాసికం జీడీపీ వివరాలను భారత ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజుల తర్వాత బ్రిటన్ను భారత్ వెనక్కినట్టు వెల్లడైంది. భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 13.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇది రిజర్వ్ బ్యాంక్ అంచనాల కంటే తక్కువ. కానీ అభివృద్ధి చెందుతున్న మిగతా దేశాలతో పోలిస్తే ఇదే ఎక్కువ వృద్ధి రేటు కావడం గమనార్హం. భారత జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
రెండో క్వార్టర్లో యూకే జీడీపీ కేవలం ఒక శాతం మాత్రమే పెరుగుదల నమోదు చేసింది. కానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది 0.1 శాతానికి తగ్గిపోయింది. యూకే స్టెర్లింగ్ విలువ సైతం డాలర్తో పోలిస్తే తగ్గింది. ఈ ఏడాది పౌండ్ విలువ భారత కరెన్సీతో పోలిస్తే 8 శాతం పడిపోయింది.
ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం వార్షిక ప్రాతిపాదికన కూడా భారత్ ఈసారి యూకేను వెనక్కి నెట్టనుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాలు ఉన్నాయి. దశాబ్దం క్రితం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 11వ స్థానంలో ఉండగా.. యూకే ఐదో స్థానంలో ఉండేది.