‘మనుషులమైన మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం. పారిశ్రామికీకరణ, విచ్చల విడి ప్లాస్టిక్ వాడకం వంటి వాటితో పాటు పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వంటివీ గాలిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయ్..’
దేశంలోని 99 శాతానికి పైగా ప్రజలు తీవ్రమైన కలుషిత వాయువులను పీలుస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన పరిమితుల కన్నా ఐదు రెట్లు ఎక్కువగా పీఎం 2.5 కలుషితాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నట్టు గ్రీన్పీస్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. ‘ఒకే ఆకాశం కింద విభిన్న వాయువులు’ పేరిట శుక్రవారం నివేదిక విడుదల చేసింది. దేశంలోని 62 శాతం మంది మహిళలు తీవ్రమైన కలుషిత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారని అందులో పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇది 56 శాతం ఉన్నదని తెలిపింది. పీఎం 2.5 స్థాయి దేశంలోనే అత్యధికంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఉన్నట్టు వివరించింది. పీఎం 2.5 కలుషితాలు శరీరం లోతుల్లోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తులు, శ్వాసనాళంలో వాపు కలిగిస్తాయి.