భాజపాకు చెందిన ఇద్దరు ఎంపీలపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఛార్టర్డ్ విమానం టేకాఫ్ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఎంపీలు నిషికాంత్ దూబె, మనోజ్ తివారీపై ఈ కేసు నమోదైంది. ఎయిర్పోర్ట్ డీఎస్పీ ఫిర్యాదు మేరకు ఎంపీలు సహా 9 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇతరుల జీవితాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించడంతో పాటు, నియమాలు ఉల్లంఘించారన్న అభియోగాలు వారిపై మోపారు. ఝార్ఖండ్లోని దేవ్గఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఆగస్టు 31న లోక్సభ ఎంపీ నిషికాంత్ దూబె, ఆయన కుమారులు, మరో ఎంపీ మనోజ్ తివారీ తదితరులు అనుమతి లేకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి ప్రవేశించారు. తమ ఛార్టర్డ్ విమానం టేకాఫ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయంలో రాత్రి పూట టేకాఫ్ చేసేందుకు అనుమతి లేదు. సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు వరకు మాత్రమే టేకాఫ్ చేసేందుకు అనుమతిస్తారు. కానీ ఎంపీలు చీకటి పడ్డాక టేకాఫ్కు ఒత్తిడి తెచ్చి అనంతరం విమానంలో వెళ్లారని డీఎస్పీ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.