‘ప్రాణాలు పోయినా వినరా?’.. ప్రజల ఆకలి బాధలు.. పట్టించుకోని పాక్ సర్కారు!
ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఘోర ఇబ్బందుల్లో పడింది. అక్కడి ప్రజలకు కడుపునిండా తినడానికి తిండి దొరకడంలేదు. ఒక పూట తిండి కోసం రోజస్తమను పనిచేయడానికి సిద్ధపడుతున్న వేలమంది పేదలకు అది కూడా దక్కడంలేదు.
తినేందుకు ఆహారం లేక.. చేసేందుకు పని లేక అష్టకష్టాలు పడుతున్న ప్రజలను పాకిస్థాన్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమ ప్రజల ఆకలి బాధలు తీర్చే బాధ్యతను విస్మరించిన షెహబాజ్ సర్కారు.. నిత్యావసరాలపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తేసింది. అండగా నిలవాల్సిన సమయంలో పాక్ ప్రభుత్వం.. తమను వెన్నుపోటు పొడిచిందని స్థానిక ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల కోసం గంపెడాశతో చాలా దూరం నడిచి వేలాదిగా తరలివస్తున్న పాక్ ప్రజలు.. తోపులాట జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అర్ధం కాక పాక్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.