మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. 95 శాతం వరకు మన ఆహారాపుటలవాట్లే మన ఆరోగ్య ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటి భోజనాలకు బదులుగా రెడీ టూ ఈట్ పదార్థాలపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నాం. ఆయా పదార్థాల్లో ఏఏ రసాయనాలు కలుపుతున్నారు.. అవి మనకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయనే సోయి లేకుండా వాటిని తినేస్తున్నాం. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచుకుంటున్నాం.
హై ప్రాసెస్ ఫుడ్స్ డేంజర్
ఎక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం ఫ్యాషన్గా మారింది. మనకు అవసరం లేకున్నా వాటినే వాడుతూ గొప్పగా ఫీలవుతున్నాం. ఆల్ట్రా ప్రాసెస్ చేయడం వల్ల ఆయా ఆహార పదార్థాల్లో పోషక విలువలు జీరో అవుతాయి. సూపర్ మార్కెట్లు, మాల్స్లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇతర ప్రాసెస్డ్ ఫుడ్స్పై రాసే హెచ్చరికలను మనం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిపుణులు చెప్తున్నా మనం చెవికెక్కించుకోవడం లేదు. ఇవి మన శరీర వ్యవస్థలకు హాని కలిగిస్తాయని తెలిసినా వాటినే తింటున్నాం.
అకాల మరణాలు
హై ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అకాల మరణాల ప్రమాదం పొంచి ఉన్నదని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం నివేదికను అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురించారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం.. అకాల, నివారించదగిన మరణాలతో ఎలా ముడిపడి ఉన్నదనే ఈ నివేదికలో స్పష్టం చేశారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను ఎక్కువగా వినియోగించడం అకాల మరణాలకు కారణమని పరిశోధకులు కనుగొన్నారు. సంక్రమించని వ్యాధుల నుంచి నివారించదగిన మరణాలలో 21.8 శాతం అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగమే కారణమని ఈ నివేదిక విశ్లేషణ పేర్కొన్నది. ‘ఇది తమ పరిశోధన తొలి అధ్యయనం. వాస్తవానికి ప్రతి ఏటా మరణాలపై ఆల్ట్ర ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రభావం ఎలా ఉన్నదనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ హై ప్రాసెస్ ఆహారాలను తీసుకోవడం వల్ల అకాల మరణాలు సంభవిస్తాయి. దశాబ్దకాలం నాటి స్థాయిలోనే ఆహారాల ప్రాసెస్ ఉన్నట్లయితే 21 శాతం అకాల మరణాలను నివారించే వీలున్నది’ అని సెంటర్ ఫర్ ఎపిడెమియోలాజికల్ రీసెర్చ్ ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో వైద్యనిపుణుడు, అధ్యయన వ్యాసకర్త ఎడ్వర్డో ఏఎఫ్ నిల్సన్ పేర్కొన్నారు. ప్రాసెస్ చేయని ఆహారాల ద్వారానే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఈ అధ్యయనం సూచిస్తున్నదని నిల్సన్ చెప్పారు.