”ప్రధాని , రాష్ట్రపతి లాంటి అత్యున్నత హోదాల్లో ఉండే నేతల సభలలో సీఎం వంటి వారు సాధారణంగా ఇంగ్లీషులో మాట్లాడతారు. కొందరు హిందీలో కూడా మాట్లాడతారు. ఇది వాళ్ళు అర్ధం చేసుకోవడానికే కాదు.. ఆనవాయితీ కూడా. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం విశాఖలో జరిగిన ప్రధాని మోదీ సభలో తెలుగులో మాట్లాడారు. ”
“సముద్ర కెరటాలు, జన కెరటాలు, శ్రీశ్రీ మాట, వంగ పండు పాట అంటూ కష్టపడి కవితాత్మక ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్… రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రిని గట్టిగా అడగలేకపోయారు! వేదిక మీద పారిశ్రామిక వేత్తలు ఉన్నప్పుడు, వారికి అర్థమయ్యేలా ఇంగ్లీషులో గొప్పలు చెప్పే సీఎం… ప్రధానికి ఎంతమాత్రం అర్థంకాకూడదనే ఉద్దేశంతో కాబోలు, అచ్చ తెలుగులో రాసిపెట్టుకున్న స్పీచును అష్టకష్టాలు పడి చదివేశారు. వెరసి… పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణతో సహా రాష్ట్ర ప్రయోజనాల గురించి మోదీని గట్టిగా కాదుకదా, మెల్లగానైనా ఆయనకు అర్థమయ్యే భాషలో చెప్పలేనని ఉత్తరాంధ్ర ప్రజల సాక్షిగా జగన్ మరోమారు తన డొల్లతనాన్ని నిరూపించుకున్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో… మోదీ సమక్షంలో ముఖ్యమంత్రి ప్రసంగం ఇలాగే సాగింది! ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ రాష్ట్ర సమస్యలపై జగన్ వినతి పత్రాలు అందించినట్లుగా ప్రభుత్వం లీకులు ఇస్తోంది. లోపల జరిగేదేమిటో తెలియదుకానీ, బయటికి మాత్రం ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే’ జగన్ మోదీని కలుస్తున్నట్లుగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు మోదీయే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నందున… జనం ముందు, రాష్ట్ర సమస్యలను ఆయనకు అర్థమయ్యేలా చెబుతారని అంతా ఆశించారు. ‘ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడరు? మోదీపై ఎందుకు యుద్ధం చేయరు?’ అని విపక్షంలో ఉండగా విరుచుకుపడిన జగన్… ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. శనివారం జరిగిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన బహిరంగ వేదికపై మోదీకి కృతజ్ఞతలు చెబుతూ రెండు చేతులు పైకెత్తి జోడించి కృతజ్ఞతలు తెలిపారు. మూడు రాజధానుల ఊసే ఎత్తలేదు. విశాఖను పరినాలనా కేంద్రంగా ప్రకటించామన్న విషయాన్ని విశాఖ గడ్డ మీది నుంచే చెప్పడానికి జగన్లే సాహసం చేయలేదు. . ‘సర్, సర్’ అని మోదీని సంభోదిస్తూ తెలుగులోనే ప్రసంగించారు. జగన్ ఏం చెబుతున్నారో ఏమీ తెలియక ప్రధాని మోదీ గంభీరంగా చూస్తూ కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, మోదీతో తనకున్న అనుబంధం ప్రత్యేకమని… రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే అజెండా లేదని జగన్ చెప్పుకోవడం గమనార్హం. ఆరేడు నిమిషాలపాటు తెలుగు ప్రసంగాన్ని చదివిన జగన్ రాష్ట్ర సమస్యలను సూటిగా ప్రధాని దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే చేయలేదు. ‘‘విభజన సమస్యల నుంచి పోలవరం దాకా, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్వరకు పలు సందర్భాల్లో, పలు విజ్ఞప్తులను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని, అన్నింటినీ పరిష్కరించాలని మనసారా కోరుకుంటున్నాను’’ అంటూ తన ప్రసంగం ముగించారు.
తెలుగులో చెబితే అర్ధమయ్యదెలా?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకెప్పుడు ఇస్తారు? ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైల్వే జోన్ ఎప్పటికి వస్తుంది? ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఎందుకు ఆమోదం తెలపడం లేదు? అని ప్రధాని మోదీని గట్టిగా అడగకపోయినా… ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ మెల్లగానైనా రిక్క్యస్ట్ మోడ్ లోనైనా కోరతారేమోనని సభకు వచ్చిన ఉత్తరాంధ్రవాసులు ఆశించారు. కానీ.. విశాఖ వేదికపై ముఖ్యమంత్రి జగన్ ఉత్తి ఉత్తర కుమారునిలా వ్యవహరించారని ఉత్తరాంధ్ర ప్రజలే విమర్శిస్తున్నారు. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగానే తెలుగులో ప్రసంగం చేశారు. ఎందుకంటే ఆ తెలుగు ప్రసంగం కూడా రాసుకొచ్చిన పేపర్ చూసి మరీ మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం అంటూ అదరగొడుతున్న జగన్ ప్రధాని సభలో కావాలని తెలుగులో మాట్లాడటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే మోదీకి అర్ధం అవ్వడం.. అందులో జగన్ డిమాండ్లు ఉంటే అవి మోడీకి కోపం తెప్పిస్తాయోమోనన్న భయం కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తోంది.