- జన్యు మార్పులు తెలుసుకునేందుకు కొత్త పద్ధతి
- వ్యాధి ముదురకముందే చికిత్స ప్రారంభించే ఛాన్స్
క్యాన్సర్.. ఇదో మహమ్మారి. ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధిని ముందే గుర్తిస్తే రోగి ప్రాణాలు కాపాడొచ్చు. అందుకే ఈ వ్యాధిని పూర్తిగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శరీరంలోని ఏ కణం వల్ల ఏ రకమైన క్యాన్సర్ వస్తుందో తెలుసుకుంటే వ్యాధిని మొదట్లోనే తుంచేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రోస్టేట్ గ్రంథి మొత్తానికి సంబంధించి పూర్తి మ్యాప్ (అడ్డుకోత ద్వారా) రూపొందించారు.
పాత పద్ధతి కంటే మెరుగైనది ..
సాధారణంగా క్యాన్సర్ సోకినప్పుడు వ్యాధి నిర్ధారణ చేసేందుకు సంబంధిత అవయవ కణజాలాన్ని సేకరించాల్సి వచ్చేది. ఆ తర్వాతే క్యాన్సర్ కణాల జన్యువులను అధ్యయనం చేయడానికి వీలుండేది. అయితే ‘స్పేషియల్ ట్రాన్స్క్రిప్టోమిక్స్’ సాంకేతిక ద్వారా నేరుగా కణజాలాన్ని సేకరించాల్సిన పని ఉండదు. ప్రోస్టేట్ మ్యాప్లో ఒకే రకమైన జన్యువులు ఉన్న కణాలను ఒక గ్రూపుగా వేరు పరిచారు. 1.5 లక్షల ప్రాంతాల్లోని ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్, లింఫ్ క్యాన్సర్, మెదడు కణాలన్నింటినీ విశ్లేషించి, అల్గారిథం అభివృద్ధిపరిచారు. ఈ అల్గారిథం, మ్యాప్ ఆధారంగా క్యాన్సర్ను ముందుగా గుర్తించి, వ్యాధి ముదరకముందే చికిత్స అందించే వీలుంటుందని చెబుతున్నారు.
బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేటీహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఫర్ లైఫ్ ల్యాబొరేటరీ, స్వీడన్లోని కర్లోనిస్కా ఇన్స్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టారు. క్యాన్సర్ సోకిన గ్రంథి కణాల్లో పలు జన్యు మార్పులు జరిగాయని తెలుసుకున్నారు. ఈ జన్యు మార్పుల గురించి తెలుసుకునేందుకు ప్రోస్టేట్ కణజాలానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, ‘స్పేషియల్ ట్రాన్స్క్రిప్టోమిక్స్’ అనే సాంకేతికను ఉపయోగించారు.