ఏపీలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని వార్తలు వస్తున్నవేళ, రానున్న ఎన్నికల్లో ఏయే పార్టీలు పొత్తులకు సిద్ధమవుతాయనే అంశంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. మంగళగిరిలో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జనసేన అధినేత బీజేపీతో కలిసి వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. గతంలో రాష్ట్రం కోసం చాలాసార్లు తాను తగ్గానని, ఈసారి మిగతావాళ్లు తగ్గితే బాగుంటుందని పరోక్షంగా టీడీపీకి సూచించారు. గతంలో తమతో పొత్తు విషయంలో వన్ సైడ్ లవ్ అంటూ వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం వార్ వన్ సైడ్ అంటున్నారని, టీడీపీ కూడా పొత్తు కోరుకుంటే ఆ పార్టీ తగ్గాల్సిందేనని, వచ్చే ఎన్నికల్లో తాము మాత్రం తగ్గేదే లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని గతంలో పలుసార్లు ప్రకటించిన పవన్ కల్యాణ్ ఈ సారి భిన్నంగా మాట్లాడటం ద్వారా బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ను ఆయన ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమకు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పిన జనసేన అధినేత… వాటిలో మొదటిది జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, రెండోది జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయడం, మూడోది జనసేన పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తామని చెపుతూ మంచి కోసం తగ్గాలనే బైబిల్ సూక్తిని పవన్ గుర్తుచేశారు. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే అందరికీ మంచిదని కూడా పవన్ సూచించారు. ఇక బీజేపీ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందా లేదా అన్నది తనకు తెలియదని ఆ పార్టీ అధిష్ఠానం ఈ విషయం గురించి తనతో మాట్లాడలేదని కూడా పవన్ తెలిపారు.
కొద్ది రోజులుగా టీడీపీ నేతలు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తోందంటూ విమర్శల దాడిని పెంచిన నేపథ్యంలో జనసేన అధినేత బీజేపీతో కలిసి వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నట్టు స్పష్టం చేయడం గమనార్హం. ఈ పరిణామాలను బట్టిచూస్తే ఎన్నికల్లో ఏపీలో ముక్కోణపు పోటీ తప్పకపోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.