మనం పెంచుకుంటున్న అవసరాల కోసం అడవులను సైతం జనావాసాలుగా మార్చుకుంటున్నాం. ఇదే ప్రకృతి వినాశనానికి అతి పెద్ద నష్టం. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ రోజున పర్యావరణ పరిరక్షణ గురించి గొప్పగా ఉపన్యాసాలు చెప్పుకుంటాం. వ్యాసాలు రాసుకుంటాం. ఇప్పుడైతే యు-ట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ పై కోకొల్లలుగా పర్యావరణం పై ప్రేమను ఒలకపోస్తున్నాం. సూటిగా చెప్పాలంటే ‘పర్యావరణ పరిరక్షణ అంటే మనకు ఇప్పటికీ,.. కాదు.. కాదు.. ఎప్పటికీ నినాదమే’ అన్న సంశయం కలుగుతుంది. కొంతైనా ఆచరణలో పెట్టాలి. చెప్పడంతోపాటు మనమూ చేయాలి.
వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే., జాదవ్ మోలే పాయంగ్‘.. అస్సాం రాష్ట్రం.. బ్రహ్మపుత్రనదీ తీరంలో ఓ ద్వీపం మజూలీ. 1979 వ సంవత్సరం.లో వచ్చిన వరదల వాళ్ళ ఆ ద్వీపం అంతా ఇసుకమయంగా మారి ఏ మొక్కా మొలవని బీడుభూమిగా మారింది. వరదలో కొట్టుకొచ్చిన అసంఖ్యాక జలచరాలు, అనేక పాములు ఎండా వేడిమికి తట్టుకోలేక విలవిల్లాడుతూ మరణించడం కళ్లారా చూసాడు జాదవ్. వృక్ష జాతి నశిస్తే మనిషి జీవితం కూడా అంతే కదా.. అనుకున్నాడు. ఆ బంజారులో మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. ఇంకా నాటుతూనే ఉన్నాడు.
జాదవ్ 40 సంవత్సరాలలో 1365 ఎకరాల బీడు భూమిని పచ్చటి అరణ్యంగా మార్చాడు. 2015లో భారత ప్రభుత్వం జాదవ్ కి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.
ఒక మనిషి పట్టుదలగా, దృఢ సంకల్పంతో శ్రమించి ఓ అడవినే సృష్టించ గలిగినపుడు, ఆ స్పూర్తితో మనలో ప్రతి ఒక్కరం ఏటా కనీసం ఒక మొక్కను నాటి, అది చెట్టయ్యే వరకు కాపాడలేమా?
భూటాన్ ఆదర్శం: హిమాలయ శ్రేణుల్లో ఉన్న ఓ చిన్న దేశం భూటాన్. అక్కడ ప్రభుత్వమే కాదు.. ప్రజలూ పర్యావరణం పట్ల చూపే అవ్యాజమైన ప్రేమ మనందరికి ఆదర్శం. ఆచరణీయం. ఆ దేశ రాజుకి కొడుకు పుట్టిన సందర్బంగా భూటాన్ లో ఒకసారి కోటి మొక్కలు నాటి ప్రకృతి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఆ దేశంలో ఆర్థికంగా స్థితి మంతులైన ఇష్టానుసారం వాహనాలు కొనరు. వినియోగించరు. పబ్లిక్ ట్రాన్స్ఫర్ నే ఎక్కువగా వాడతారు. మరో వందేళ్లకు కూడా వారు పర్యావరణ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఏదైనా అవసరం నిమిత్తమే, అడ్డం వస్తుందనే ఒక చెట్టును కొట్టాల్సి వస్తే భూటానీయులు .. మరో మొక్క నాటి.. అది చెట్టుగా ఎదిగే వరకు కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆ స్ఫూర్తి అక్కడ అందరిలో ఉంటుంది.
అస్సాంకి చెందిన జాదవ్.. ఒక వ్యక్తి.. 40 ఏళ్ల కృషి,. భూటాన్.. ఓ చిన్న దేశం. ఈ రెండు ఉదాహరణల కంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇంకేం కావాలి. పర్యావరణాన్ని రక్షించుకోవడం .. అంటే మనల్ని మనం కాపాడుకోవడమే కదా.. మన పిల్లల పుట్టిన రోజులకో, మన పెళ్లి రోజులకో, ఇంకో శుభ సందర్భాలలోను.. మొక్కలు బహుమతులుగా ఇవ్వడం, తర్వాత కలిసినపుడు.. మేమిచ్చిన మొక్క ఎలా ఉంది? అని అడగడం.. అలవాటు చేసుకుంటే.. పెద్దగా శ్రమ లేకుండానే పచ్చదనం ఫరిఢవిల్లుతుంది.