తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర అధికారుల బృందాన్ని కూడా వెంటబెట్టుకుని నిజానికి ఆయన వెళ్లింది.. కేంద్ర ఆర్థిక శాఖను ఒప్పించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవడం, అదనంగా రుణాలు సేకరించుకునేందుకు ఆమోద ముద్ర వేయించుకోవడం కోసం. అయితే కేసీఆర్కు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలు అంత సజావుగా లేవు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పనిలో పనిగా అక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నాయకులతో వరుసగా భేటీలు నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన సమాజ్వాది పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్యాదవ్తో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, బీజేపీయేతర రాష్ట్రాల్లో పరిస్థితులు సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొంతకాలంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటిదాకా అవేమంత సానుకూల ఫలితాలనివ్వలేదు. అయినా ఆయన పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వస్తున్నారు.
అప్పట్లో అన్నీ అనుకూలించే రెండోసారి అధికారం
వాస్తవానికి 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి తెలంగాణలో రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న కేసీఆర్ ఇక తనకు రాజకీయంగా తిరుగులేదని భావించారు. ఆ ఎన్నికలకు ముందే.. నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వ హయాంలో అన్యాయం జరుగుతోందంటూ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగారు. ఆయన మోదీని వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీతో సఖ్యత పెంచుకోవడం తెలంగాణలో టీఆర్ఎస్కు ఊహించనివిధంగా కలిసివచ్చాయి. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యమనే నినాదంతో ముందుకెళుతున్న మోదీ తమ ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ కోలుకోకూడదనే లక్ష్యంతో టీఆర్ఎస్ గెలుపునకు సహాయ సహకారాలు అందించారు. పరిస్థితులన్నీ అనుకూలించడంతో కేసీఆర్ సునాయాసంగా మరోసారి సీఎం పీఠం దక్కించుకున్నారు. నాటినుంచి కేసీఆర్ తగిన సమయం చూసి తనయుడు కేటీఆర్కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించి తాను కేంద్ర రాజకీయాలకు వెళతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈసారి ఎదురవుతున్న సవాళ్లెన్నో..
అయితే నాడున్న సానుకూల పరిస్థితులు ఒక్కొక్కటిగా కేసీఆర్కు దూరమవుతూ వచ్చాయని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ మిగులు ఆదాయ రాష్ట్రంగా ఆవిర్భవించడం కేసీఆర్ ప్రజాకర్షక పథకాల అమలుకు గొప్ప వెసులుబాటు ఇచ్చింది. రైతు బంధు వంటి పథకాలు, అత్యంత భారీ వ్యయంతో కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం వంటివి చేపట్టి కేసీఆర్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోగలగడానికి అదే కారణం. కానీ ఆ పథకాలే సంపన్న రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కోసం వెంపర్లాడే పరిస్థితికి తెచ్చాయన్న విమర్శలను ఇప్పుడు ఎదుర్కోవాల్సివస్తోంది. కాళేశ్వరం నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, అసలు ఆ ప్రాజెక్టే ఏమాత్రం లాభదాయకం కాదని, ముందు ముందు తెల్ల ఏనుగులా రాష్ట్రానికి భారంగా మారడం ఖాయమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
మరోపక్క అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ కూడా రాజకీయంగా టీఆర్ఎస్కు గట్టి సవాళ్లు విసురుతున్నాయి. బీజేపీ ఏకంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. ఈ అంశమే ఇప్పుడు కేసీఆర్కు కలవరం కలిగిస్తోంది. అందుకే ఆయన బీజేపీని ఎదుర్కొనేందుకు మార్గాలు వెతుకుతున్నారు. నిజానికి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అప్రతిహత విజయంతో సత్తా చాటడం దేశవ్యాప్తంగా విపక్షాలను నిరుత్సాహపరచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పలు రాష్టాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇంకో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు దాదాపు అవకాశాలు లేనట్టే. మరి ఈ సమయంలో కేసీఆర్ ఇతర పార్టీలను కూడగట్టి బీజేపీతో పోరాటానికి చేసే ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.