కల్యాణ్రామ్ కెరీర్లో ‘బింబిసార’ మూవీ ఓ మైలురాయిలా నిలుస్తుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తారక్ మాట్లాడుతూ తన సోదరుడు కల్యాణ్రామ్ ఈ మూవీ కథ గురించి రెండున్నరేళ్ల క్రితం చెప్పాడని, ఇంత పెద్ద ప్రాజెక్టును అనుభవం లేని దర్శకుడు వశిష్ట ఎలా డీల్ చేస్తాడోనని మొదట్లో సందేహం ఉన్నా..ఈ సినిమా చూశాక థ్రిల్ అయ్యానని చెప్పారు. కథ ఎంత కన్విన్సింగ్ చెప్పాడో అంత గొప్పగానూ తెరకెక్కించాడని తెలిపారు. ఈ చిత్రం కోసం తన అన్న కళ్యాణ్రామ్ ఎంతగానో శ్రమించి తనను పాత్ర కనువుగా మలుచుకున్నాడని, ఈ పాత్ర తాను తప్ప మరెవరూ పోషించలేరని ఎన్టీఆర్ ప్రశంసించారు. ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందని ఎన్టీఆర్ అన్నారు.
ఇండస్ట్రీకి గడ్డుకాలమనే మాటను తాను నమ్మనని, సినిమాలో సత్తా ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని తారక్ అన్నారు. ప్రేక్షకులు మెచ్చినంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటామన్నారు. ఈ చిత్రానికి పని చేసిన నటులు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి వెన్నెముక అన్నారు. అభిమానులు కాలర్ ఎగరేసేలా రాబోయే సినిమాల్లో తమ పాత్రలు ఉంటాయని చెప్పిన ఎన్టీఆర్ .. ‘బింబిసార’ మూవీతోపాటు ‘సీతారామం’ చిత్రాన్ని కూడా ప్రేక్షకులంతా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
చిత్ర కథానాయకుడు కల్యాణ్రామ్ మాట్లాడుతూ తనకు జానపద చిత్రాలంటే చాలా ఇష్టమని, తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణల స్ఫూర్తితో ఈ చిత్రంలో నటించానని, దీనిని తమ తాతగారికి అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రం ఎవరినీ నిరాశపరచదని చెప్పారు.