తెలుగుదేశం పసుపు పండుగ మహానాడు సందర్భంగా శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభ రాజకీయ ప్రత్యర్థులకు వణుకు పుట్టించే స్థాయిలో సక్సెస్ అయింది. ఒంగోలు గడ్డ నడిబొడ్డున టీడీపీ రాజకీయ గర్జన చేసింది. సభకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగానే హాజరయ్యారని ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అయితే ప్రాంగణం బయట ఉండిపోయిన జనం, ట్రాఫిక్లో ఇరుక్కున్నవారిని కలుపుకుంటే ఈ సంఖ్య మరో లక్షకు పైగానే పెరుగుతుందని టీడీపీ నాయకులు చెపుతున్నారు. 44 డిగ్రీల ఎండలో జనం ఈ స్థాయిలో వస్తారన్నది ఎవరూ ఊహించని విషయం.
ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు ఇలా ఎలా అవకాశముంటే అలా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ఇంతకుముందు ఎన్నో మహానాడులు చూశాం కానీ ఇంతమంది సామాన్య కార్యకర్తలు, ప్రత్యేకించి మహిళలు తాడోపేడో తేల్చుకోవాలని రావడం చూడటం మాత్రం ఇదే మొదటిసారి.. అంటూ పలువురు టీడీపీ నాయకులే ఆశ్చర్యపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఈ సభ ఏ స్థాయిలో విజయవంతమైందో. నువ్వూ నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రభంజనం.. ఇక్కడి జనసందోహం చూశాక సభలో మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీహీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలివి.
40% టికెట్లు యువతకే..
ఇకపై పార్టీలో 40 శాతం పైగా టిక్కెట్లు యువతకే ఇవ్వనున్నట్టు పార్టీ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా సభలో యువనేతలు మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలనుంచి విశేష స్పందన వచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలనలో ఆంధ్ర అప్పుల కుప్పగా మారిందని, ఈ సొమ్మంతా అక్రమంగా వైసీపీ నేతల దగ్గరగా చేరుతోందంటూ నిప్పులు కురిపించారు. టీడీపీ అధికారంలోకి అవినీతి సొమ్మును కక్కిస్తామని ప్రకటించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు. కార్యకర్తల ఉత్సాహం అదుపుతప్పకుండా చంద్రబాబునాయుడు వేదికమీద తిరుగుతూ వారిని సముదాయంచాల్సివచ్చింది. అచ్చెంనాయుడు, బాలకృష్ణ, లోకేష్ మాట్లాడుతున్న సమయంలో జై తెలుగుదేశం అంటూ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది.