తెలంగాణలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని కంకణం కట్టుకున్న బీజేపీ అధినాయకత్వం దానికి తగినట్టుగానే ఆ రాష్ట్రంలో సభలు సమావేశాలు, యాత్రలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఎంత హడావుడి చేసినా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలం అంతంతమాత్రమేనని అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఇటు పునర్వైభవం కోసం తపిస్తున్న కాంగ్రెస్ పార్టీ చెపుతూ వస్తున్నాయి. అయితే బీజేపీకి అంత బలం లేదని భావించిన పలు రాష్ట్రాల్లో పక్కావ్యూహంతో ఆ పార్టీ అధికారం కైవసం చేసుకోవడం దేశంలో ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ ముఖచిత్రం. ప్రజాభిప్రాయాన్ని తనకనుకూలంగా మార్చుకోవడంలో ఆ పార్టీ సరికొత్త వ్యూహాలకు తెరతీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈసారి ముక్కోణ పోటీ జరిగి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
కాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చని భావిస్తున్న సమయంలో ఇప్పుడు వరుసగా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలియజేస్తూ పలు సంస్థలు తమ సర్వే రిపోర్డులను వెల్లడిస్తున్నాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి ఆధిక్యంలో నిలిచే అవకాశాలే ఎక్కువని ఆత్మసాక్షి సర్వే సంస్థ తేల్చి చెప్పింది. ఈ సంస్థ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 39.5శాతం ఓట్లతో 56 – 59 స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ 31.5% ఓట్లతో 37 – 39 స్థానాలు, బీజేపీ 21శాతం ఓట్లతో 14 – 16 దాకా సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని, కొన్నిచోట్ల మాత్రం ముక్కోణపు పోటీ ఉండవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. మజ్లిస్ పార్టీకి 2.75 – 3.25శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది.
అయితే తాజాగా వచ్చిన ఆరా సంస్థ సర్వేలో దీనికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 30 శాతం, కాంగ్రెస్ 23 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్- బీజేపీల మధ్యే ఉండబోతోందన్నమాట. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిస్తే.. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి జారిపోనుందని ఈ సర్వే చెపుతోంది.
ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ వర్గాలతో మాట్లాడుతూ పీకే సర్వే నివేదికలో తేల్చిన అంశం ఇదేనంటూ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్కు 25 సీట్లకు పరిమితమవుతుందని, మరో 17 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని, కాంగ్రెస్ 32 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించారు. మరో 23 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని, బీజేపీకి 6 నుంచి 8 సీట్లలో గెలవొచ్చని, మరో 8 సీట్లలో పోటీలో ఉంటుందని, ఎంఐఎం 5 నుంచి 7 సీట్లలో గెలిచే అవకాశం ఉందని పీకే రిపోర్టు లో ఉన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ సర్వేల్లో ఒకదానికొకటి పొంతన లేని ఫలితాలు కనిపిస్తుండటంతో ఇవి ఆయా పార్టీలు తమకనుకూలంగా చేయించుకున్న ఫేక్ సర్వేలుగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు, తటస్థులను తమవైపు మళ్లించుకునేందుకు అన్ని పార్టీలు ఇలా సర్వేలంటూ ఊదరగొడుతున్నాయని పలువురు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ బలం గతంతో పోలిస్తే బాగా పెరిగిందని, ఈ సర్వేలు కూడా దానినే సూచిస్తున్నాయని ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. ముక్కోణపు పోటీ తప్పకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ద్వారా టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కవచ్చని, మజ్లిస్ మద్దతుతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. లేదా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలనూ కొట్టిపారేయలేమని మరికొందరు చెపుతున్నారు.