‘కరోనా సమయంలో డాక్టర్స్ ఏ మందు వాడాలని సలహా ఇస్తే జనం ఎగబడి అదే మందు కొని మింగేసేవారు. ఇదే బలహీనతను పట్టుకుని ఓ ఫార్మా కంపెనీ డాక్టర్స్ కి భారీ నజరానాలు ఇచ్చి ప్రజల నుంచి భారీగా దోచుకుంది..’
కరోనా పుణ్యమా అని దేశంలో ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన మందుల్లో ముందు వరుసలో ఉంటుంది డోలో-650. అయితే ఆ మందులను అమ్మేందుకు తయారీదారులు తీవ్రమైన అనైతిక చర్యలకు పాల్పడ్డారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొన్నది. తమ బ్రాండ్ను ప్రచారం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ‘బహుమతులు’, ప్రయాణ ఖర్చులను అందజేసినట్టు స్పష్టం చేసింది. ఈ అనైతిక చర్యలకు పాల్పడిన కంపెనీపై విడిగా, ప్రత్యేకమైన దర్యాప్తు జరపాలని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ.. ఫార్మాసుటికల్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. ఆదాయ పన్నుల శాఖ సోదాల్లో కంపెనీలో లభించిన డాక్టర్ల వివరాలు గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.
బయట పడిందిలా..
బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ లిమిటెడ్ ఈ డోలో-650 తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీకి చెందిన 36 ప్రాంతాలపై జూలై 6న ఆదాయ పన్నుల శాఖ ఏకకాలంలో దాడులు జరుపడంతో ఈ బండారం బయటపడింది. దాడుల్లో దీనికి సంబంధించిన ఆధారాలను గుర్తించి సీజ్ చేశారు. అయితే సీబీడీటీ నివేదికలో నేరుగా మైక్రోల్యాబ్స్ పేరు కానీ, డోలో-650 పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆ కంపెనీ మైక్రోల్యాబ్ అని స్పష్టమవుతున్నది. ఈ బహుమతులను మందుల ప్రచారానికి వాడుకున్నట్టు అకౌంట్స్ బుక్స్లో ‘సేల్స్ అండ్ ప్రమోషన్’ కింద నమోదు చేసారు.