కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాఏమాత్రం ఖాతరు చేయకుండా కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే కార్యక్రమంలో ముందుకే సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడంతోపాటు ఆ పరిశ్రమను కొనుగోలు చేసేందుకు తామూ సిద్దమేనని తెలంగాణ సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి మైనింగ్ సంస్థను రంగంలోకి దింపుతామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగానే ఆ దిశగా అధ్యయనం కోసం ఇప్పటికే తెలంగాణ అధికారుల బృందం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిశీలన కోసం వచ్చింది. ఉద్యోగులను, కార్మికనేతలతో కూడా సంప్రదించింది. మరోపక్క తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాధ్యాసాధ్యాలెలా ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం విస్తృతస్థాయిలో చర్చకు తెరతీసిందన్న విషయం వాస్తవం.
బహుళ ప్రయోజనాలే లక్ష్యం
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం నిలబడతామని కేసీఆర్ మాట్లాడుతుండటం వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశ్యమే ప్రధానంగా ఉందని ఆ పార్టీ విమర్శిస్తోంది. అయితే రాజకీయ చతురతతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న కేసీఆర్ అంతకుమించిన రాజకీయ ప్రయోజనాలనే ఈ నిర్ణయం ద్వారా ఆశిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విశాఖ ఉక్కు రక్షణ కోసం నిలబడ్డామని ప్రచారం పొందడం ద్వారా అటు కేంద్రాన్ని ఇరుకునపెట్టడం, ఇటు తెలంగాణలో తిరిగి బలపడాలని చూస్తున్న టీడీపీని డిఫెన్స్లో పడేయడం, తన బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో కనీసం ఉత్తరాంధ్రలో ఎంతోకొంత ఆదరణను తెచ్చుకోవడం వంటి బహుళ ప్రయోజనాలను కేసీఆర్ ఆశిస్తున్నట్టు అవగతమవుతోందని వారంటున్నారు.
ఏపీనుంచి వలస వెళ్లిన వారి ఓట్లపై గురి
నిజానికి హైదరాబాద్లో దశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో ఆంధ్రులు స్థిరపడిన విషయం తెలిసిందే. అంతేకాక గడచిన రెండు మూడేళ్లుగా ఏపీనుంచి పలు కుటుంబాలు ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వలసబాట పట్టిన మాట నిజం. వీరిలో అత్యధిక శాతం తరలివెళ్లింది హైదరాబాద్ నగరానికే. లక్షల సంఖ్యలో ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు సరెండర్ చేసి తెలంగాణలో తీసుకున్నట్టు గ్యాస్ కంపెనీల డేటా వెల్లడిస్తోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఆంధ్రుల ఓట్లపై కేసీఆర్ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఆకారణంగానే ఏపీలో ఓటును వదులుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించినట్టు అంటున్నారు. పలు అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను నిర్ణయించగల బలం వీరికి ఉంది. మరి ఈవిషయంలో కేసీఆర్ ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో ఆయనను బీజేపీ సహా ఇతర ప్రత్యర్థులు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.