” మోదీని గద్దె దించేందుకు ప్రతిపక్షాల్ని ఏకం చేయడానికి సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి.” రానున్న లోక్సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మరో ముందడుగు పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేతలు ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. బీజేపీపై ఐకమత్యంగా పోరాడే అవకాశాలపై చర్చించారు.
సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు. నితీశ్ కుమార్ మాట్లాడుతూ, సాధ్యమైనన్ని పార్టీలను సమైక్యపరచి, కలిసికట్టుగా పని చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీల కీలక నేతల కలయిక దేశ వ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేచింది.