ఇటీవలికాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా ఒంటికాలిపై లేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రధానిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏక్నాథ్షిండేలున్నారని తెలంగాణ బీజేపీ నేతలు తాజాగా వ్యాఖ్యానించడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలోనే ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే తాను కూడా అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పుకు సిద్ధమని కేసీఆర్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. అంతేకాదు.. ఇప్పటిదాకా దేశాన్ని పాలించినవారిలో అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి నరేద్రమోదీయేనని, దేశం అన్ని రంగాల్లోనూ తీవ్రంగా దెబ్బ తినడానికి ఆయనే కారణమని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కేవలం దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి సమయాన్నివెచ్చిస్తోందని, తమిళనాడు, తెలంగాణల్లో ఏక్నాథ్షిండేలను తయారు చేయడం బీజేపీ తరం కాదని కేసీఆర్ అన్నారు. తాము ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదని, కేంద్రానికి భయపడబోమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని అడ్డుకుంటామనిప్రకటించారు. గతవారం హైదరాబాద్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కేసీఆర్ గురించి ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు పాల్పడలేదు. బీజేపీ చేస్తున్న అభివృద్ది గురించి మాత్రమే ప్రస్తావించారు.
అయితే కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే తెలంగాణలో బీజేపీ దూకుడు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నట్టే కనిపిస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయికి విస్తరిస్తామని కొంతకాలంగా కేసీఆర్ చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయత్నాలకు ఇతర పార్టీల నేతలనుంచి ఇప్పటిదాకా ఏమంత స్పందన కనిపించలేదు.