1972లో భారత్.. పాకిస్థాన్తో యుద్ధం చేసి తూర్పు బెంగాల్కు విమోచన కల్పించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో భారత్ సైన్యాన్ని అత్యంత సమర్థంగా నడిపి అమెరికా, చైనాల అండతో రెచ్చిపోతున్న పాక్ పీచమణిచిన ఘనత ఫీల్డ్ మార్షల్ శామ్మానెక్షాది. ఈ యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలి.. ఎప్పుడు ఎలా శత్రువులపై దాడి చేయాలి అనే అంశాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ఈ విషయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా శామ్ మానెక్షా ఏం చెపితే అది విన్నారంతే. ఈ యుద్ధంలో భారత్ గెలిచాక ఏకంగా 2 లక్షల మందికి పైగా పాక్ సైనికులు మన సైన్యానికి బందీలుగా చిక్కారు. అయితే వారిని భారత్ పాక్కు సురక్షితంగా అప్పగించింది.
ఈ యుద్ధం తరువాత లాహోర్ వెళ్లిన మానెక్ షాకు పాక్ ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ బంగళాలో బస చేసిన మానెక్షాకు గవర్నర్ తన సిబ్బందిని పరిచయం చేశారు. ఆ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన గురించి 2002లో స్వయంగా మానెక్ షానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రోజు ఆయన బయటకు వెళ్లేసరికి అక్కడి సిబ్బంది వరుసగా నిలబడ్డారట. వారిని గవర్నర్ షాకు పరిచయం చేస్తుండగా ఆయనతో కరచాలనం చేస్తున్న వారిలో ఒకవ్యక్తి తనతలపాగా తీసి మానెక్షా కాళ్ల వద్ద పెట్టాడట. వెంటనే దాన్ని తీసి అతడి చేతికి అందించిన షా.. అలా ఎందుకు చేశారని ఆ వ్యక్తిని ప్రశ్నించగా అప్పుడా వ్యక్తి తనకు ఐదుగురు కొడుకులని వారంతా పాక్ సైన్యంలో పని చేస్తున్నారని బంగ్లాదేశ్ యుద్ధంలో వారు ఖైదీలుగా భారత్ చేతికి చిక్కారని తెలిపాడట.
యుద్ధ ఖైదీలైనా పాక్ సైనికులను భారతదేశం చాలా గౌరవంగా చూసుకుందని తన కొడుకులు తనకు చెప్పారని ఆ వ్యక్తి షాకు వివరిస్తూ కృతజ్ఞతా భావంతో కన్ళీళ్లు పెట్టుకున్నాడట. ‘‘మా సైనికులకు చదువుకోవడానికి మీరు ఖురాన్ ఇచ్చారు. భారత సైనికులతో సమానంగా ఆహారం పెట్టారు. భారతీయులు చెడ్డవాళ్లంటే మేం ఎప్పటికీ నమ్మం’’ అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు’’ అని షా వెల్లడించారు. అయితే సైనిక నియమాలు, ధర్మం పాటించి పాక్ సైనికులను జాగ్రత్తగా చూసుకున్నందుకు పాక్లో తనకు అపూర్వమైన గౌరవం లభించగా స్వదేశంలో చాలా విమర్శలను ఎదుర్కొన్నానని కూడా షా అప్పట్లో సరదాగా వ్యాఖ్యానించారు.
శత్రు సైనికులను సొంత అల్లుళ్ల మాదిరిగా చూస్తున్నాడన్న వ్యాఖ్యలు కూడా ఆయన చెవిన పడ్డాయట. ఇదే విషయంపై చాలా మంది ఆయనపై నాటి ప్రధాని ఇందిరాగాంధీకి కూడా ఫిర్యాదు చేయడంతో ఆమె ఆయనను ప్రశ్నించారట. అయితే ఆయన మాత్రం ‘వాళ్లు కూడా సైనికులే. తమ దేశం కోసం బాగా పోరాడారు కానీ, ఓడిపోయారంతే’ అని చెప్పడంతో ఇందిరాగాంధీ మారుమాట్లాడలేకపోయారట.