‘కువైటో, దుబయో .. ఇంకో గల్ఫ్ కంట్రీనో వెళితే కొన్ని ఏళ్ల లోనే ఆర్ధికంగా సెటిల్ అవ్వొచ్చన్న ఆశ తెలుగు రాష్ట్రాలలో కొన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉంది..’
కొవిడ్ ప్రభావం ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నిధులపైనా పడింది. ఈ మహమ్మారి దెబ్బతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ సహకార కూటమి (జీసీసీ) దేశాల్లోని ప్రవాస భారతీయులు.. స్వదేశానికి పంపే నిధుల మొత్తం భారీగా తగ్గింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఐల నుంచి మన దేశానికి వచ్చిన నిధుల్లో 50 శాతానికిపైగా ఈ దేశాల నుంచే వచ్చింది. 2020-21లో ఇది ఏకంగా 30 శాతానికి పడిపోయినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఒక నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్,సింగపూర్ వంటి సంపన్న దేశా ల్లోని ఎన్ఆర్ఐలు పంపే నిధులు 36 శాతానికి చేరాయి. అమెరికాలోని ఎన్ఆర్ఐలు యూఏఈని తోసిపుచ్చి ఈ జాబితాలో తొలి స్థానం సంపాదించారు. 2020-21లో ఎన్ఆర్ఐల ద్వారా సమకూరిన మొత్తం నిధుల్లో 23 శాతం అమెరికాలోని ప్రవాసుల ద్వారా సమకూరాయి. దీనికి తోడు ఎన్ఆ ర్ఐల నుంచి ఎక్కువ నిధులు అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళను తోసిపుచ్చి మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. కోవిడ్ ప్రభావం తర్వాత క్రమంగా కోలుకుంటున్న తరుణంలో రానున్న రోజులలో గల్ఫ్ ఎన్ఆర్ఐ ల నిధులు పెరుగుతాయని మరికొన్ని సర్వేలు, అంచనాలు చెపుతున్నాయి.