దేశంలో మరోసారి కలవరం కలిగిస్తున్న కోవిడ్ మహమ్మారి తెలంగాణలోనూ తన ప్రభావం చూపుతోంది. తెలంగాణలో మంగళవారం ఒక్కరోజులోనే 403 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం పెరుగుతుండటంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 80 వేలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే గడచిన కొన్ని రోజులుగా నిత్యం 12 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు మంగళవారం 10 వేల దిగువకు చేరడం కాస్త ఊరటనిచ్చే అంశం.
ఇక తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, జనసమ్మర్థం అధికంగా ఉన్నచోట్ల మాస్కులు ధరించడంతోపాటు, భౌతిక దూరం కూడా పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధులు అత్యవసరమైతేనే గానీ బయటకు రాకుండా ఉంటే మంచిదని, జలుబు జ్వరం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది.