ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్కు బీజేపీ తెర దించింది. ముందుగా రాజకీయ వర్గాలు ఊహించినట్టుగానే ఎస్టీ మహిళను పోటీకి దించనుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేస్తూ.. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పలువురి పేర్లను చర్చించి చివరకు ముర్ము పేరును ఖరారు చేశారు.
తూర్పు రాష్ట్రాలకు చెందిన గిరిజన మహిళకు ఈ గౌరవం దక్కితే బాగుంటుందని పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అత్యధికులు అభిప్రాయపడినట్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, వివాదరహితురాలని జేపీ నడ్డా చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము 2000 సంవత్సరంలో రాయ్రంగాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒడిషా బీజేపీ ఎస్సీ శాఖ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. గతంలో ఒడిషా రవాణా శాఖ మంత్రిగానూ ఆమె పనిచేశారు. ఇక విపక్షాల తరపున మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ పడనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీలో ప్రస్తుతం అధికార విపక్షాలకు ఉన్న బలాబలాలను బట్టి చూస్తే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖాయమనే చెప్పవచ్చు.