విశాఖలోని ఎండాడ గ్రామ పరిధిలో రాజీవ్ స్వగృహ పథకం కింద ఇళ్లు నిర్మించడానికి ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల్ని సేకరించింది. అయితే ఆ భూములను వేలం వేయడానికి ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ భూమి దాదాపు 5 ఎకరాలు ఉంటుంది. దానిని ప్రభుత్వం 22,264 చ.గజాలుగా పేర్కొంది. ఆ భూమి వేలంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాజీవ్ స్వగృహ పథకం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన స్థలాన్ని వేలం వేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వమే స్థిరాస్తి వ్యాపారం చేయడం అవుతుంది. ప్రభుత్వం ఆ తరహా వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఆ భూముల వేలంపై స్టే ఇస్తున్నాం…’ అని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
ఆ వేలం ఈ నెల 30న జరగాల్సిఉంది. వేలం ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ, వేలం నిర్వహించనున్న సంస్థ ఎంఎస్టీఎస్ ఎండీకి నోటీసులు కూడా జారీ చేసింది. విచారణను జులై 4కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లా ఎండాడ గ్రామం సాగరిక టౌన్షిప్ పరిధిలోని 22,264 చ.గజాలు ఓపెన్ ప్లాట్లు 1, 6ను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ మే 5న జారీ చేసిన వేలం ప్రకటనను సవాలు చేస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
ఈ వేలం ప్రకటనను రద్దు చేయాలన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన స్థలాన్ని వేలం వేయడం చట్ట విరుద్ధం. ప్రజలకు సముచిత ధరల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఈ పథకం అమల్లో భాగంగా 2009లో ఎండాడ గ్రామ పరిధిలోని 54.17 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అందులో 22,264 చదరపు గజాల భూమిని ఆన్లైన్ వేలం వేసేందుకు స్వగృహ కార్పొరేషన్ ప్రకటన ఇచ్చింది. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలి…’ అని పేర్కొన్నారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. యథాతథ స్థితి(స్టేటస్ కో) పాటించాలని అధికారులకు సూచించింది. అయితే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ .. ‘మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతాం. ఈనెల 30న వేలం ప్రక్రియ ఉంది. ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారం చేయడం లేదు. వేలం నిర్ణయం ఇప్పటిది కాదుఈ’ అని పేర్కొన్నారు. ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఈ నెల 30న వేలం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ ప్రక్రియను నిలిపేస్తూ స్టే ఇచ్చింది.