పంజాబ్ రాష్ట్రం అజ్నాలలో 2014లో వందలకొద్దీ వెలుగుచూసిన అస్థిపంజరాలు… సైనికులవిగా నిర్దారణ అయింది. అక్కడ సమీపంలో బావిలో లభ్యమైన ఈ అస్థిపంజరాలపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఇండియా పాక్ విడిపోతున్న సమయంలో జరిగిన అల్లర్లలో చనిపోయిన వారివిగా కొందరు భావించగా… మరికొందరు మాత్రం 1857లో బ్రిటీష్ ఆర్మీ చేతుల్లో మృతి చెందిన భారత సైనికులవిగా చెబుతుంటారు. అయితే సీసీఎంబీ శాస్త్రవేత్తలు మాత్రం ఇవి సైనికుల అస్తిపంజరాలుగా తేల్చారు.
పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఆంత్రపాలజిస్ట్ డాక్టర్ జే.ఎస్.సెహ్రావత్.. లఖ్నవూకు చెందిన బీర్బల్ సాహ్నీ ఇన్స్టిట్యూట్, బెనారస్ యూనివర్సిటీలతో కలిసి పరిశోధనలు చేసినట్టు సీసీఎంబీ ప్రకటించింది. అస్థిపంజరాల డీఎన్ఏలను పరిశీలించినప్పుడు… అవి యూపీ, బిహార్, పశ్చిమబంగాల్కు చెందిన వారివిగా గుర్తించారు. ఈ పరిశోధనల ప్రకారం 26వ నేటివ్ బెంగాల్ ఇన్ఫ్యాన్ట్రీ బెటాలియన్కు చెందిన సైనికుల అస్థిపంజరాలుగా వెల్లడించింది. ఈ బెటాలియన్లో అప్పట్లో బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీకి చెందిన సైనికులున్నట్టు వివరించింది.
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ సైనికులు పాకిస్థాన్లోని మైన్మీర్ వద్ద బ్రిటీష్ సైనికులను చంపినవారని శాస్త్రవేత్తలు కొన్ని బలమైన ఆధారాలను బట్టి వెల్లడించారు. బ్రిటీష్ సైనికులు వారిని తిరిగి అజ్నాల వద్ద పట్టుకుని చంపినట్టు పేర్కొన్నారు. చరిత్ర చెబుతున్న వాస్తవాలకు ఈ పరిశోధనలు మరింత బలం చేకూరుస్తున్నాయని ఈ సందర్భంగా సీసీఎంబీ ప్రకటించింది.
ఆహారపు అలవాట్ల గురించి..
డీఎన్ఏ అనాలసిస్ కోసం 50 నమూనాలను, ఐసోటోప్ అనాలసిస్ కోసం 85 నమూనాలను ఉపయోగించినట్లు సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే తంగరాజ్ తెలిపారు. పూర్వీకుల గురించి అర్థం చేసుకోవడానికి డీఎన్ఏ అనాలసిస్ ఉపయోగపడుతుందని, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడానికి ఐసోటోప్ అనాలసిస్ ఉపయోగపడుతుందన్నారు. ఈ రెండిటిని వినియోగించి నిర్వహించిన పరీక్షల్లో ఈ బావిలో దొరికిన అస్థిపంజరాలు పంజాబ్ లేదా పాకిస్థాన్లో జీవించిన ప్రజలకు సంబంధించినవి కాదని రుజువైందని చెప్పారు. డీఎన్ఏ సీక్వెన్స్ ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ ప్రజల డీఎన్ఏ సీక్వెన్స్తో మ్యాచ్ అయిందన్నారు. తంగరాజ్ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ డైరెక్టర్ కూడా, ఆయన ఈ పరిశోధక బృందంలో సీనియర్ సభ్యుడు.
భారత్ సైనికుల ఉరితీత
ఈ అధ్యయనం తొలి రచయిత డాక్టర్ సెరావత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ బావిలోని అస్థిపంజరాలపై జరిపిన పరిశోధనలో వెల్లడైన ఫలితాలు 26వ నేటివ్ బెంగాల్ ఇన్ఫాంట్రీ బెటాలియన్కు సంబంధించిన చారిత్రక సాక్ష్యాధారాలతో పొసగుతున్నాయి. ఈ బెటాలియన్లో బెంగాల్, ఒడిశా, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు ఉన్నారు. చారిత్రక రికార్డుల ప్రకారం ఈ బెటాలియన్ సైనికులు పాకిస్థాన్లోని మియాన్-మీర్లో తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ సైనికాధికారులను చంపారు. వారిని బ్రిటిష్ సైన్యం నిర్బంధించి, అజ్నాలా సమీపంలో ఉరితీశారు. గట్టి ఆధారాలతో చరిత్రను పరిశీలించేందుకు ఈ బృందం నిర్వహించిన సైంటిఫిక్ రీసెర్చ్ దోహదపడుతుందని ప్రాచీన డీఎన్ఏ నిపుణుడు, ఈ పరిశోధక బృందంలో లీడ్ రీసెర్చర్ డాక్టర్ నీరజ్ రాయ్ స్పష్టం చేసారు.