వెండితెర మాంత్రికుడు జేమ్స్ కామెరాన్ అనితరసాధ్యంగా తెరకెక్కించిన ‘అవతార్’ మూవీ అప్పట్లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును దాటిన మొదటి మూవీ కావడం విశేషం. అంతేకాదు.. మొత్తం 2.8 బిలియన్ డాలర్ల కలెక్షన్లతో తిరుగులేని రికార్డులను సృష్టించింది. ఇప్పటికీ గాన్ విత్ద విండ్ తర్వాత అత్యధిక వసూళ్ల రికార్డు ఈ చిత్రానిదే. సైన్స్ ఫిక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో సాటిలేని మేటి డైరెక్టర్ గా పేరున్న జేమ్స్ కామెరాన్ 1994 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టి దాదాపు 15 ఏళ్లు శ్రమించి తీశాడు దీన్ని. 22వ శతాబ్దం మధ్యలో మానవులు భూమి నుంచి పండోరా అనే గ్రహానికి వెళ్లి అక్కడ లభించే అత్యంత విలువైన ఓ ఖనిజాన్ని తవ్వి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆ గ్రహవాసులు వ్యతిరేకించి యుద్ధం చేసి తమ గ్రహ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఈ చిత్రం ఇతివృత్తం.
కాగా ప్రపంచ సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్న అవతార్ సీక్వెల్స్ ఇప్పుడు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో రెండో భాగం ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ఇప్పుడు మీడియాలో వార్తలు సందడి చేస్తున్నాయి. అవతార్-3 2024లోను, అవతార్-4 2026లోనూ, అవతార్-5 2028లోనూ ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఈ చిత్రబృందం శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ ఈ చిత్రాలను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 13 సంవత్సరాలుగా ఈ సీక్వెల్ చిత్రాల రూపకల్పనలో మునిగిన జేమ్స్ వీటిని తొలిభాగం కంటే అద్బుతంగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్టు హాలీవుడ్ వార్తలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాయో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.