కన్నడనాట బీజేపీ ఓటమితో చతికిలబడింది. అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమనుకున్న కమలం పార్టీకి ఆశాభంగమే ఎదురైంది. కాంగ్రెస్ జోరులో కాషాయదళం కేవలం 64 సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. బీజేపీని మట్టి కురిపించిన కాంగ్రెస్ (Congress) పార్టీ ఏకంగా 136 సీట్లతో చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. మోదీ పార్టీ ఓటమికి ముఖ్య కారణాలేమిటో.. రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చలను ఒకసారి పరిశీలిద్దాం…
1. కలసిరాని మతరాజకీయం…
కర్ణాటక బీజేపీ నేతలు రెండేళ్లుగా రాజకీయం కోసం మత సంబంధమైన అంశాలను వివాదాస్పదంగా లేవనెత్తుతూ వచ్చారు. హలాల్, హిజాబ్, అజాన్తోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత ‘బజరంగ్ దళ్’ అంశాన్ని కూడా రాజకీయాస్త్రంగా వాడుకున్నారు. అయితే మతపరమైన ఈ అంశాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినప్పటికీ కర్ణాటకలో బీజేపీకి ఏమాత్రం సానుకూలమవ్వలేదు. హిందూత్వ కార్డ్ ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి అక్కరకొచ్చిందేమో కానీ కర్ణాటకలో ఏమాత్రం కలిసి రాలేదని ఫలితాలను చూస్తే స్పష్టమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2. కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మిన జనం
బీజేపీ సర్కారు అవినీతిని ఎత్తిచూపుతూ ‘40 శాతం కమిషన్ ప్రభుత్వం’ అంటూ కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది. బీజేపీ అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ చేసిన ఈ నినాదం క్రమంగా జనాల్లోకి ప్రబలంగా వెళ్లింది. దీనికితోడు అవినీతి ఆరోపణలపై కేఎస్ ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయడం కాంగ్రెస్ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆ మంత్రి గురించి ఏకంగా ప్రధాన నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేయడం మరింత ప్లస్ అయ్యింది. ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ గెలుపుపై తీవ్రంగా ప్రభావం చూపాయనే చెప్పాలి.
3. BJP అసమర్ధ నాయకత్వం..
బీజేపీ ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకతను ఆ పార్టీ నాయకులు తిప్పి కొట్టడంలో విఫలమయ్యారు. కర్ణాటకలో బీజేపీకి సమర్థులైన నాయకుల కొరత ఏర్పడింది. ఇది కూడా ఎన్నికల ఓటమికి ఓ కారణం.
4.కీలక నేతలను పక్కనపెట్టడం.. బీజేపీ ఘోర పరాభవానికి ఆ పార్టీ తరపున బలమైన నేతలెవరూ కనిపించకపోవడం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మైని నాయకత్వం తీసుకొచ్చింది. అయితే రాష్ట్ర పురోగతి, మార్పుల విషయంలో జనం కోరుకున్న విధంగా బసవరాజ్ బొమ్మై పాలన అందించడంలో విఫలమయ్యారన్న వాదనలున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్, సిద్ధరామయ్య వంటి బలమైన నేతలు కనిపిస్తుండడం బీజేపీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిణామమే కర్ణాటక బీజేపీని బలంగా దెబ్బకొట్టింది.
5. పాపులారిటీ ఉన్న నేతలు దూరంగా..
కర్ణాటక బీజేపీలో అత్యంత కీలకమైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ ఎన్నికల్లో అంత చురుకుగా పాల్గొనలేదు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవదిలకు ఈ ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు. దీంతో ఎన్నికల బరిలో దిగేందుకు వీరిద్దరూ కాంగ్రెస్లో చేరిపోయారు. యడియూరప్ప, జగదీశ్ షెట్టర్, లక్ష్మణ్ సవది.. వీరు ముగ్గురూ లింగాయత్ వర్గానికి చెందినవారు ప్రబలమైన నేతలు. వీరిని బీజేపీకి ప్రతికూలంగా మారిందనే చర్చ నడుస్తోంది.
6. లింగాయత్ ల సపోర్ట్ కాంగ్రెస్ కి…. ప్రచారంలో బీజేపీ పలు వాగ్ధానాలు చేసింది. ముఖ్యంగా ఆధిపత్య వర్గాలకు చెందిన ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పలు హామీలు గుప్పించింది. ఈ వాగ్ధానాలను లింగాయత్ వర్గం విశ్వసించలేదు. అంతేకాదు దళిత్, ఆదివాసి, ఓబీసీతోపాటు వక్కలింగా ఓట్లు కూడా బీజేపీకి దూరమయ్యాయి. ఇదే సమయంలో ముస్లిం, దళితులు, ఓబీసీల ఓటర్లను తమవైపు నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. అంతేకాదు లింగాయత్లు కూడా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా ఉండటం వల్ల వాళ్ళ ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ కి వేయించుకోగలిగారన్న ప్రచారం ఉంది.