కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారతాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పొత్తులతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయ్. ఈ మేరకు జనసేనాని పూర్తి స్పష్టత ఇచ్చారు. అయితే వైసీపీ నేతలు, చంద్రబాబు అధికారంలోకి రాకూడదని బలంగా కోరుకునే వాళ్ళు పవన్ ని రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇంకా విరమించడంలేదు. అయితే జనసేన పొత్తు టీడీపీకి కలసి వస్తుందేమో కానీ, బీజేపీని కలుపుకుంటే మాత్రం ముక్యంగా రాయలసీమలో ముస్లింలు టీడీపీ కి మరోమారు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికే గ్రహించారు.
మోదీ అంటే ఈసారి అంతగా భయపడక్కర్లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీ-మోదీ వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి. నిద్రపోతున్న రాహుల్ గాంధీని అనవసరంగా గెలుక్కుని మోదీ పీకమీదకు తెచ్చుకున్నారు. కర్ణాటక ఓటమితో … పొరుగున ఉన్న తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికలలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.. బీజేపీతో పొత్తు కు దూరంగా ఉంటె మోదీ ఆగ్రహం చవి చూడాలని భయపడితే మాత్రం చంద్రబాబును ఈ సారి కాపాడేవారు ఎవరుంటారు?
తెలుగు రాష్ట్రాలపై కర్ణాటక ప్రభావం
కర్ణాటకలో హిందుత్వ వాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు ఎంతగా ప్రయత్నించినా కన్నడిగులు నమ్మలేదు. ఆ వాదాన్ని తిప్పికొట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించడాన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. అధికారం ఉంది కదా అని నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రజలే అంకుశాన్ని చేతిలోకి తీసుకుంటారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అవినీతి పెచ్చరిల్లినా పట్టించుకోని ప్రధానమంత్రి, ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కర్ణాటకలో మోదీ గ్లామర్ పనిచేయలేదని భావించాలి. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కర్ణాటక ఫలితాలు దోహదం చేస్తాయి. తెలుగునాట కూడా కర్ణాటక ఫలితాల ప్రభావం స్పష్టంగా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూతనోత్సాహం వస్తుంది. అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఈ ఫలితాలు తీవ్ర మరోవేదన కలిగిస్తాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ అగ్ర నాయకులు కర్ణాటక ఓటమి తర్వాత ఇప్పుడు గుర్తించక తప్పదు. దీంతో బెట్టు వీడి తెలుగుదేశం–జనసేనతో చేతులు కలపడానికి చొరవ తీసుకొనే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు విశాఖ ఉక్కు ను ప్రయివేటీకరణ చేసే యత్నం.. పోలవరం ప్రాజెక్ట్ ను పట్టించుకోకపోవడం, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించడం,, వంటి అనేక అంశాలపై ఏపీ జనం భారతీయ జనతా పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతిని చంద్రబాబు, పవన్ గుర్తుపెట్టుకోవాలి. అయితే టీడీపీ గతిలేని పక్షంలో బీజేపీతో కలసి వెళ్ళాలి తప్ప.. ఆ పార్టీకి కమలం పొత్తు రాజకీయంగా నష్టమని చెప్పాలి. తప్పని పరిస్థితులలో టీడీపీ -జనసేన-బీజేపీ పొత్తులతో వెళితే … కమలం కౌగిలిలో సై’కిల్’ అయ్యే ప్రమాదం పొంచి ఉందని..రాజకేయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నేతలను హెచ్చరిస్తున్నారు.