రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచాక కూడా రాజధాని అభివృద్ధి కాకపోవడం, అసలు రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితిలోనే ఉండటం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం పనులు నత్తనడకన సాగడం, కొత్తగా పరిశ్రమలేవీ రాకపోవడం ఇదీ ప్రస్తుతం ఏపీ దుస్థితి. నిజానికి రాష్ట్రానికి బీజేపీ లేదా కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి గట్టిగా ప్రశ్నించి, ప్రజల తరపున పోరాడే నాయకుడే రాష్ట్రంలో లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పాలి. దురదృష్టకరమైనా ఇదే నిజం. ఈ దిశగా టీడీపీ గతంలో పోరాడలేదని చెప్పలేం. అప్పట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీపై చూపుతున్న వివక్ష కారణంగానే ఆ పార్టీతో విభేదించి కూటమి నుంచి నాటి టీడీపీ ప్రభుత్వం బయటకు వచ్చింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం అలా గట్టిగా పోరాడిన కారణంగానే చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా తనకు చేతనైన అన్నిమార్గాల్లోనూ బీజేపీ పని చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానేనేమో ఆ స్థాయిలో బీజేపీతో పోరాడేందుకు ఇప్పుడు టీడీపీ సిద్ధంగా లేదు.
ఇప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతున్నారాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నడవటానికి అవసరమైన అన్ని సహకారాలనూ కేంద్రం అందజేస్తోంది. అయితే రాష్ట్రాభివృద్ధికి సహకరించే ప్రత్యేక హోదా వంటి అంశాలను మాత్రం పూర్తిగా పక్కనపెట్టింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయినా కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాటల గారడీ మాత్రం చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని అధికార పార్టీ, విపక్షాలు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై ఆచితూచి మాత్రమే విమర్శలు చేస్తున్నాయి. దీనికి ఎవరి కారణాలు వారికుండవచ్చుగాని రాష్ట్రం మాత్రం మరింత అన్యాయానికి గురవుతోందన్నది మాత్రం నిజం.
నిజానికి సినీ హీరోగా తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్నజనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఇప్పుడు రాష్ట్రం ఉన్న అధ్వాన్నపరిస్థితులు నాయకుడిగా ఎదిగేందుకు గొప్ప అవకాశం అని చెప్పాలి. భావి తరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల తరపున నిజాయితీగా ఆయన పోరాటానికి దిగితే .. సిసలైన ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించేందుకు తగిన వాతావరణం ఉంది. కానీ ఆయన దానిని వినియోగించుకోవడం లేదు. తద్వారా చారిత్రక తప్పిదం చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసినా తమకు పోయేదేమీ లేదని, బానిస సంకెళ్లు తప్ప.. అని చెపుతున్న పవన్ కల్యాణ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అన్నిశక్తుల పైనా అదే స్థాయిలో పోరాటానికి దిగితేనే రాష్ట్ర ప్రజల్లో ఆయనపై విశ్వాసం పెరిగే అవకాశముంది.
గతంలో రాజధాని అమరావతి విషయంలో అవినీతి జరుగుతోందని ఆధారం లేని ఆరోపణలు చేసిన పవన్ ఒకరకంగా అమరావతి నిర్మాణం ఆగిపోవడానికి పరోక్షంగా తానూ కారణమయ్యారు. అలాగే నాటి టీడీపీ ప్రభుత్వంపై, లోకేష్పై సైతం అలాంటి ఆరోపణలే చేశారు. కానీ అవేవీ నిజం కావని ఆ తరువాత కాలంలో తేలిపోయింది. కానీ ఆయన ఆరోపణలు తటస్థ ఓటర్లపై గట్టి ప్రభావమే చూపాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి, నేడు రాష్ట్రం అధోగతి పాలవడానికి పవన్ వ్యాఖ్యలూ కారణమే. అయితే అలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన పవన్కల్యాణ్పై ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయకుండా నిగ్రహం పాటిస్తూ, ఇప్పటికీ ఆయన పార్టీతో పొత్తు కోసమే ప్రయత్నాలు సాగించడం బహుశా రాజకీయ అవసరంగా టీడీపీ నాయకత్వం భావిస్తుండవచ్చు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కూడా ఆవిధంగా ఆలోచించేలా చేసి ఉండవచ్చు. కానీ ఇతరులకు ఇది టీడీపీ బలహీనతగా మాత్రమే కనిపిస్తోంది. అందుకే టీడీపీ క్యాడర్ కూడా పొత్తు ప్రయత్నాలపై ఏమంత సానుకూలంగా లేరనే చెప్పాలి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ ఐక్యంగా పోరాడలేని విపక్షాల బలహీనత ఏపీకి శాపంగా మారిందని చెప్పాలి. మరి ఈ పరిస్థితులను మార్చగలిగే నాయకుడెవరా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారిప్పుడు..!