తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు అవుతోంది. ఇన్నేళ్ల ప్రస్థానంలో పార్టీ అధికారంలో ఉన్న కాలమే తక్కువ. తొలి ఇరవై ఏళ్లలో అయితే పార్టీ 15 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది. ఈ కాలంలో 5 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొని 4 సార్లు తిరుగులేని విజయం సాధించింది. కేవలం 1989 ఎన్నికల్లో మాత్రమే ఓడింది.
దీనికి కారణం ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో చురుకైన యువనాయకత్వాన్ని ఏరికోరి ఎంపిక చేయడం. వారు పార్టీ కోసం సైనికుల్లా పని చేయడం. క్షేత్రస్థాయిల్లో పార్టీ క్యాడర్ను ముందుండి నడిపించడం. పలనాడులో కోడెల శివప్రసాదరావు, ఉత్తరాంధ్రలో అశోక్గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కింజరాపు ఎర్రంనాయుడు, గోదావరి జిల్లాల్లో యనమల రామకృష్ణుడు, కోటగిరి విద్యాధరరావు, తెలంగాణలో ఎలిమినేటి మాధవరెడ్డి, టి. దేవేందర్గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులంతా ఆ కాలంలో వెలుగులోకి వచ్చినవారే. ఎన్టీఆర్కి ఉన్న విశేషమైన ప్రజాకర్షణకు నాడు ఈ యువ నాయకత్వం తోడైంది. ఈ కారణంగానే దశాబ్దాలపాటు అప్రతిహతంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఢక్కామొక్కీలు తిన్న సీనియర్ రాజకీయ నాయకుల కోటలను సైతం తెలుగుదేశం పార్టీ సునాయాసంగా బద్దలుకొట్టింది.
అయితే 1999 ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ వ్యూహం మార్చింది. తెలుగుదేశం పాలనపై, ఆ పార్టీ నాయకత్వంపై అసత్య ప్రచారానికి పెద్దపీట వేస్తూ, ఆ ప్రచారాన్ని ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాన్ని ఎంచుకుంది. దీనిని అడ్డుకునే సమర్థవంతమైన ప్రతివ్యూహం అప్పటినుంచి ఇప్పటిదాకా టీడీపీ వద్ద లేదనే చెప్పాలి. ఫలితంగా 2004 నుంచి ఇప్పటిదాకా జరిగిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో 3 సార్లు టీడీపీ ఓటమి చవిచూసింది. కేవలం 2014 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. అదీ రాష్ట్ర విభజన కారణంగా మనసులు తీవ్రంగా గాయపడ్డ ఆంధ్ర ప్రజలు చంద్రబాబు సమర్థంగా పనిచేసి విభజిత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలంగాణకు దీటుగా నిలబెట్టగలరని ప్రజలు విశ్వసించిన కారణంగా. అయితే పలు సమస్యలు ఎదుర్కొంటూ కూడా ఇక్కడ అభివృద్ధి చేసి కూడా టీడీపీ 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. మళ్లీ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేని కారణంగానే కావడం గమనార్హం.
వారే గుదిబండలు..
టీడీపీ ఈవిధంగా బలహీనపడటానికి కారణాలు విశ్లేషిస్తే సమర్థవంతమైన యువనాయకత్వం పార్టీలో కొరవడటం.. లేదా వారు బలపడకుండా, పూర్తిస్థాయిలో పని చేయనీయకుండా అక్కడ పాతుకుపోయిన సీనియర్ నాయకులు అడ్డంకిగా మారడం. ఒకప్పుడు పార్టీకి బలంగా ఉన్న నాయకులే ఇప్పుడు గుదిబండగా మారారని పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ లో తీవ్రస్థాయిలో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికల నగారా ఏ క్షణంలోనైనా మోగవచ్చని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేత ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. అంటే విపక్షం పూర్తిస్థాయిలో సిద్ధం కాకుండా, బలం పుంజుకోకుండా ఎన్నికలకు వెళ్లేందుకు ముందుగానే ఎన్నికలకు అధికార వైసీపీ వ్యూహం పన్నుతోందని టీడీపీ నాయకత్వం భావిస్తోందనుకోవాలి. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులను, యువ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ శ్రేణులను అందుకు ఏవిధంగా సిద్ధం చేయనుందనే అంశం ఆసక్తికరంగా మారింది.