తాజ్మహల్.. ప్రపంచ వింతల్లో ఒకటి. ఈ మెరిసే పాలరాతి సమాధిని తిలకించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రజలు ఆగ్రాను సందర్శిస్తుంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా ఈ స్మారక చిహ్నాన్ని చూడాలని అనుకుంటారు. అందరిలాగే కాన్పూర్కు చెందిన యువకుడు సావన్.. తాజ్మహల్ను చూడాలని అనుకున్నాడు. ఆగ్రా వెళ్లేందుకు అతడివద్ద డబ్బులు లేవు. అయితే, తాజ్మహల్ను చూడాలనే కోరిక బలంగా ఉండడంతో తన సైకిల్ను రూ.400కు అమ్మేసి, ముగ్గురు స్నేహితులతో కలిసి తల్లిదండ్రులకు చెప్పకుండా ఆగ్రా వెళ్లాడు.
సావన్ తన స్నేహితుడు దీపక్ సలహా మేరకు తన సైకిల్ను విక్రయించాడు. ఆ డబ్బుతో దీపక్, అభయ్, కిషన్తో కలిసి ఆగ్రాకు బయలుదేరాడు. ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కారు. కానీ స్మారక చిహ్నం వద్దకు వెళ్లేంత డబ్బులు లేవు. దీంతో స్టేషన్ వెలుపల ఒక హోటల్లో రూ.300 కోసం పనిచేశారు. ఆ డబ్బులతో తాజ్మహల్ను సందర్శించారు.
యువకులు తప్పిపోయారనుకుని వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లలను ఎలాగైనా తీసుకొచ్చి, అప్పగిస్తానని కాన్పూర్ పోలీస్ కమిషనర్ బీపీ జోగ్దంద్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. యువకులు టిక్కెట్టు లేకుండానే రైలులో కాన్పూర్కు తిరిగి వచ్చారు. కానీ తల్లిదండ్రులకు భయపడి ఇంటికి వెళ్లలేదు. ఆ యువకులను కాన్పూర్ పోలీసులు గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.