135 ఏళ్ల ఘన చరిత్రతో పాటు, దేశానికి దాస్య శృంఖలాలనుంచి విముక్తి కలిగించిన గొప్ప నాయకుల విలువల స్ఫూర్తి ఆ పార్టీది. 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఐదు దశాబ్దాలకు పైగానే అధికారంలో కొనసాగిన ఘనత కూడా ఆ పార్టీ సొంతం. ఒకనాడు దేశవ్యాప్తంగా నలుచెరగులా పట్టణాల్లో మాత్రమే కాదు.. మారుమూల పల్లెల్లోనూ ఆ పార్టీ జెండా రెపరెపలాడేది. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేడు నాయకత్వ లేమితో బేలగా చూస్తోంది. వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఉనికిని నిలుపుకునేందుకు పోరాడుతోంది. గత వైభవాన్ని తిరిగి అందుకోవడమెలాగో తెలియని అయోమయావస్థలో కొట్టుమిట్టాడుతోంది.
ఆ పార్టీకి భవిష్యత్తు ఆశాకిరణాలనుకున్న బలమైన యువనాయకులతో పాటు, ఇప్పటిదాకా పార్టీ మోస్తూ వచ్చిన సీనియర్ నాయకులు సైతం ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి ప్రత్యర్థి శిబిరాల్లో చేరుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వరకు దేశంలో అప్రతిహతంగా అధికారం చలాయించిన బలమైన పార్టీకి ఇలాంటి దుస్థితి ఏమిటో అర్థంకాక కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలోకి జారుకుంటున్న పరిస్థితి నెలకొంది.
పార్టీని వీడిన గులాంనబీ ఆజాద్..
రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలు
కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధంతోపాటు, సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరున్న సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడటం ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను ప్రతిబింబిస్తున్నదని చెప్పాలి. తాను పార్టీని వీడటానికి గల కారణాలను ఏకరువు పెడుతూ ఆయన అధినేత్రి సోనియాగాంధీకి ఓ లేఖ కూడా రాశారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆయన తన లేఖలో విమర్శలు గుప్పించారు. 2013లో రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడైన నాటినుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన విధానాల కారణంగానే పార్టీ బలహీనపడిందని, 2014లో రాహుల్ కారణంగానే పార్టీ ఓటమి పాలైందని ఆజాద్ ఆరోపించారు.
పార్టీలో సీనియర్ నాయకులందరినీ రాహుల్గాంధీ పక్కనపెట్టారని, తన అనుచరవర్గం, కోటరీద్వారా అన్ని నిర్ణయాలను తీసుకుంటూ వచ్చారని విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్నా ఆమె పాత్రను నామమాత్రం చేశారని, రాహుల్ రాజకీయ అపరిపక్వత కారణంగానే పార్టీ ప్రస్తుత దుస్థితికి చేరిందని ఆరోపించారు. అయితే గులాంనబీ ఆజాద్ కొంతకాలంగా తన అసంతృప్తిని తరచుగా బాహాటంగానే వ్యక్తం చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతారని పార్టీ వర్గాలు ముందుగానే అంచనా వేశాయి. కాగా ఆయన బీజేపీలో చేరుతారని ముందుగా భావించినా.. సొంత పార్టీని పెట్టే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
పార్టీని కుంగదీస్తున్న వలసలు
నిజానికి గులాంనబీ ఆజాద్తో కాంగ్రెస్ నుంచి వలసలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ సహా కపిల్ సిబాల్ వంటి పలువురు సీనియర్ నాయకులు, వ్యూహకర్తలు ఇప్పటికే ఆ పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. ఒకపక్క అమిత్షా ద్వయం ఆధ్వర్యంలో పటిష్టమైన వ్యూహాలతో భారతీయ జనతాపార్టీ దేశవ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సరైన నాయకుడిని ఎన్నుకోలేని నిస్సహాయతతో.. స్వయంకృత తప్పిదాలతో అంతకంతకూ బలహీనపడుతుండటం ప్రజాస్వామిక వాదులను కలవపరపరచే అంశమే.