” కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసలు కరెంటే ఇవ్వలేదు.. దీనివల్లే జనాభా పెరిగింది…”అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న కర్ణాటకలో అప్పుడే రాజకీయం వేడెక్కింది. పోటాపోటీ సభలు, వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక పర్యటనకు వచ్చిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ.. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ‘అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వాళ్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటే మీరు నమ్ముతారా? వారు అధికారంలో ఉన్నప్పుడు అసలు కరెంటే ఇచ్చేవారు కాదు. గ్రామాల్లో విద్యుత్ ఉండేది కాదు. అందువల్లే జనాభా పెరిగిపోయింది’ అని ప్రహ్లాద్ జోషి వ్యంగంగా అన్నారు.